భద్రత డొల్లే!: వరంగల్ కేంద్ర కారాగారంలో దొంగతనాలు, ఖైదీల పరారీ
వరంగల్: దేశంలోనే అత్యంత భద్రత అని వరంగల్ కేంద్ర కారాగారానికి పేరు. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే అంతా అభద్రతే కనిపిస్తోంది. ఇటీవల సినీ ఫక్కీలో ఇద్దరు ఖైదీలు పారిపోవడం సంచలనంగా మారింది. ఇటీవల భోపాల్ జైలు నుంచి 'సిమి' ఉగ్రవాదులు తప్పించుకుని ఎన్కౌంటర్కు గురైన సంఘటన మరవకముందే మరోసారి మన దగ్గరి జైలులోని డొల్లతనం బయటపడింది.
వరంగల్ కేంద్ర కారాగారంలో అత్యంత భద్రత ఉందని కరడుగట్టిన నేరస్థులను, ఉగ్రవాదులను తీసుకువస్తారు. గతంలో ఎన్కౌంటర్కు గురైన వికారుద్దీన్ లాంటి వారిని సైతం ఇక్కడే పెట్టారు. పలువురు పాకిస్థాన్ గూఢచారులు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కట్టుదిట్టంగా ఉండాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. శిక్ష పడ్డ ఇద్దరు నేరస్థులు సిబ్బంది కళ్లు గప్పి తప్పించుకోవడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఖైదీలు కూడా చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తుండగా వివాదాస్పదంగా మారడంతో వరంగల్కు తరలించారు. పైగా వీళ్లిద్దర్ని అత్యంత భద్రతగల బ్యారక్ 'భద్ర'లో ఉంచారు. ఈ హైసెక్యూరిటీ బ్యారక్లో మూడంచెల్లో భద్రత ఉంటుంది. పైగా నిరంతరం ఇద్దరు సెంట్రీలు పహారా కాస్తుంటారు. ఈ బ్యారక్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం.
కానీ ఖైదీలు కారాగారం భద్రత డొల్లతనాన్ని ఆసరాగా చేసుకుని పారిపోయినట్టు తాజా సంఘటనను చూస్తే అర్థమవుతుంది. పహారా సిబ్బంది అప్రమత్తంగా లేరని తేటతెల్లమవుతోంది. 'భద్ర' బ్యారక్కు మూడు తాళాలు వేయాలి. ఇక్కడ మాత్రం ఒకే తాళం వేసి మరో రెండు తాళాలు వేయకపోవడంతోనే వీళ్లు ఒక తాళాన్ని పగులగొట్టి సులువుగా పారిపోగలిగారు.
పనిచేయని సీసీ కెమెరాలు:
కారాగారంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయకపోవడం గమనార్హం. ఇద్దరు ఖైదీలు అదును చూసి రాత్రివేళ తప్పించుకుపోయినా సరిగ్గా ఎన్నిగంటలకు బయటపడ్డారనే సంగతి జైలు సిబ్బందికే సరిగా తెలియకుండా ఉంది. ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సంఘటన జరిగిన తీరును అంచనా వేయలేకపోతున్నారు.
ఇద్దరు ఖైదీలు ఉదయం 2.30 నుంచి 3.30 మధ్య తప్పించుకుపోయారని సిబ్బంది చెబుతున్నారే తప్ప వాళ్లు సరిగ్గా ఎన్ని గంటలకు పారిపోయారనే విషయం తెలియదు. కాగా కారాగారం సిబ్బంది గుర్తించింది మాత్రం ఉదయం నాలుగు గంటల తర్వాతే. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తే కచ్చితమైన సమయం తెలిసి ఉండేది. ఖైదీలు కారాగారం దక్షిణ గోడపై ఉన్న విద్యుత్తు తీగలను దాటి బయటకు రావడం అంత సులువు కాదు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో వాచ్ టవర్ కూడా ఉంది. అందులో సిబ్బంది రాత్రింబవళ్లు నిఘా పెట్టాలి. అర్ధరాత్రి ఖైదీలు తప్పించుకునేందుకు యత్నిస్తుంటే నిఘా ఉన్న సిబ్బందికి తెలియకపోవడం విశేషం.
విద్యుత్తు ప్రవాహం లేనట్టేనా?:
ఖైదీలు తప్పించుకున్న తీరును పరిశీలిస్తే అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రతకలిగిన వరంగల్ కేంద్ర కారాగారంలో జైలు గోడలపై ఏర్పాటుచేసిన విద్యుత్తు కంచెకు విద్యుత్తు సరఫరా లేనట్టు అనుమానం కలుగుతోంది. విద్యుత్తు ప్రవాహం ఉంటే సాధారణంగా ఎవరూ తప్పించుకోలేరు. పైగా ఖైదీలు గోడ దూకే క్రమంలో సుమారు వందమీటర్ల వరకు గోడపైనే నడిచిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. మరి అంత చిమ్మచీకట్లో గోడపై నడుస్తుంటే విద్యుత్తు తీగలు తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కానీ ఖైదీలకు ఎటువంటి హాని జరగలేదు. దీన్నిబట్టి చూస్తే తీగల్లో విద్యుత్తు సరఫరా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జైల్లోనే దొంగతనం:
ఖైదీలు పరారయ్యే క్రమంలో జైలు బ్యారక్లోని ఓ గడియారాన్ని తమ వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.