ఆధ్యాత్మిక గురువు: ఏపీ రాజకీయాల్లో ఆయన కేంద్రంగా మారుతున్నారా?
విశాఖపట్నం/అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్వామీజీలు కీలకంగా మారుతున్నారా? ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? అంటే కావొచ్చునని అంటున్నారు. ఇటీవలి పరిణామాలు దానికి ఊతమిస్తున్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి ఉమాభారతి వంటి సాద్విలు, యోగి ఆదిత్యనాథ్ వంటి స్వామీజీలను ప్రజాప్రతినిధులగా చూస్తున్నాం.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ హిందుత్వవాదం అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తే, ప్రజాక్షేమం కోరే, ఎలాంటి భవబాంధవ్యాలు లేని స్వామీజీల వంటి వారికి ఎలాంటి వ్యక్తిగత కోరికలు ఉండవు కాబట్టి పాలన బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
స్వరూపానందేంద్ర సరస్వతి వద్దకు నేతలు
తెలుగు రాష్ట్రాలలో శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరి, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను ప్రచారం చేశారు. వీరంతా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇటీవల పలుమార్లు విశాఖ శ్రీ శారదా పీఠం స్వరూపానందేంద్ర సరస్వతి వద్దకు వెళ్తున్నారు.
స్వామీజీ ఆశీస్సులు
జగన్ గతంలో ఓసారి విశాఖ వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవల థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా భువనేశ్వర్ వెళ్లేందుకు విశాఖ వెళ్లారు. స్వామీజీని కలిశారు. తన వ్యవసాయ క్షేత్రంలో చేసిన యాగాన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోని నిర్వహించారు. ఇక స్వామీజీ కూడా విజయవాడలో గతంలో దేవాలయాల కూల్చివేతపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
చంద్రబాబుపై ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం, జగన్, కేసీఆర్ వంటి నేతలు ఒకటికి రెండుసార్లు ఆయనను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో పరోక్షంగా రాజకీయాల్లో స్వామీజీ కేంద్రంగా మారుతున్నారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినట్లుగా, తాను ఏపీ రాజకీయాల్లో వేలుపెడతానని ప్రకటించారు. హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. దీనిని జగన్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కేసీఆర్ మద్దతు జగన్కే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అదే ఇద్దరు నేతలు స్వామీజీని కలుస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆయన కేంద్రంగా మారుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
గతంలోనే టీడీపీ విమర్శలు
దాదాపు మూడేళ్ల క్రితం స్వామీజీ.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఎన్నికలకు ముందు బ్రాహ్మణుల ఓట్ల కోసం తన చుట్టూ ప్రదక్షిణలు చేసిన పార్టీ ఇప్పుడు బ్రాహ్మణుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆ తర్వాత దానిని మరిచారని, ఇప్పుడు కూడా నామమాత్రపు నిధులతో ఏర్పాటు చేశారని, బ్రాహ్మణ నిధులను టీడీపీ నేతలే స్వాహా చేశారని విమర్శలు గుప్పించారు. జగన్కు అనుకూలంగా కూడా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కూడా స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోవర్టులా ఆయన మాట్లాడుతున్నారన్నారు.