సీఎంను డిసైడ్ చేస్తామంటాడు తమ్ముడు.. టీఆర్ఎస్ జిందాబాద్ అంటాడు అన్న.. MIM లో ఏంటీ కన్ఫ్యూషన్?
హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలంటే వారికి సలాం కొట్టాల్సిందేనా? సీఎం కుర్చీ వారు ఓకే చెప్పినవారికేనా? తాజాగా ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి గద్దెపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు ఇప్పటి కేసీఆర్ దాకా తాము చెప్పినోళ్లే ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారన్న కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. అయితే అక్బరుద్దీన్ అన్న అసదుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ కే తమ సపోర్ట్ అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. తమ్ముడేమో తాము చెప్పినోళ్లే ముఖ్యమంత్రి అంటాడు.. అన్నేమో టీఆర్ఎస్ కు వంత పాడతారు. ఇంతకు ఎంఐఎం పార్టీలో ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.
సీఎం కుర్చీపై అక్బరుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అన్న అసదుద్దీన్ కామెంట్స్ తెరపైకి వచ్చాయి. ఇటీవల నిర్మల్ సభలో టీఆర్ఎస్ కే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు అసదుద్దీన్. అంతేకాదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తో అసదుద్దీన్ కు అంతర్గత ఒప్పందం ఉందనేది విపక్షాల ఆరోపణ. వాటిని నిజం చేస్తూ ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేయాలని అసదుద్దీన్ పిలుపునిస్తున్నారు. అయితే అన్న అసదుద్దీన్ వ్యాఖ్యలకు భిన్నంగా అక్బరుద్దీన్ మాట్లాడుతుండటం చర్చానీయాంశంగా మారింది.
అన్న అట్లా.. తమ్ముడు ఇట్లా..! ఎంఐఎంలో కన్ఫ్యూజన్ ఉందా?
ఎంఐఎం పార్టీ కీలక నేతలుగా ఎదిగిన అన్నాదమ్ముళ్ల వ్యాఖ్యలు ఎన్నికల సందర్భంగా రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. తాము చెప్పినోళ్లకే సీఎం కుర్చీ దక్కుతుందన్నట్లుగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో అన్న అసదుద్దీన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో ఇంటర్నల్ లింక్ పెట్టుకున్న ఎంఐఎం పార్టీకి చిక్కులు రావొద్దనే ఉద్దేశంతో అసదుద్దీన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. సోదరుడి వ్యాఖ్యలు జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లకుండా.. ప్రత్యర్థులకు అస్త్రంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎంఐఎం పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పడానికి.. టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
అదంతా స్ట్రాటజీయా?
ఎన్నికల వేళ ఈ అన్నాదమ్ముళ్ల వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారుతున్నాయి. అంతేకాదు టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే లోకల్ పార్టీలనీ తాజాగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అన్నేమో టీఆర్ఎస్ కు వంత పాడుతుంటే.. తమ్ముడేమో డిసెంబర్ 11 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిని తామే డిసైడ్ చేస్తామనడం వెనుక ఉద్దేశ్యమేంటనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసదుద్దీన్ టీఆర్ఎస్ కు ఓట్లేయాలంటూ బహిరంగంగానే చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో అక్బరుద్దీన్ ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురావడం లేదు. దీంతో అక్బరుద్దీన్ కాంగ్రెస్ ఫేవర్ గా ఉన్నారా అనేది మరో కోణంగా కనిపిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్న చక్రం తిప్పొచ్చని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ్ముడు చక్రం తిప్పొచ్చనే స్ట్రాటజీతో ఉన్నారా అనే ఊహాగానాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. అదలావుంటే ఎన్నికలప్పుడు ఓటర్లను ఆకర్షించడానికి ఈ సోదరులిద్దరు ఏదో ఒక హాట్ కామెంట్ చేస్తారనే వాదనలున్నాయి.
ఎంఐఎంతో అందుకేనా కాంప్రమైజ్?
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎంఐఎం పార్టీ బలం అంతగా కనిపించదు. హైదరాబాద్ లోని పాతబస్తీలో మాత్రమే ఆ పార్టీ హవా కనిపిస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాల నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే ఎంఐఎం లీడర్లు లేరని చెప్పొచ్చు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కనపడని ఎంఐఎం హవా హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రమే పరిమితమనేది బహిరంగ రహస్యం. అందుకే ఎంఐఎం పార్టీ నేతలకు దగ్గరయితే పాతబస్తీలో మాత్రమే వారితో కాంప్రమైజ్ ఉంటుందని.. ఇక రాష్ట్రమంతటా ముస్లిం మైనార్టీల ఓట్లు టీఆర్ఎస్ కు లాభిస్తాయనేది కేసీఆర్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. దానికనుగుణంగా ఈ ఎన్నికల్లో
టీఆర్ఎస్ గెలుస్తుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని పబ్లిక్ మీటింగుల్లో అసదుద్దీన్ చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఈ అన్నాదమ్ముళ్ల కామెంట్లు ఎంఐఎం పార్టీశ్రేణులు ఎలా తీసుకుంటాయో చూడాలి.