పంతులు సలహాకు అంత పవర్ ఉందా..? అందుకేనా ఈ ముందస్తు హైరానా..?
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత ఏమీ లేదు. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చేసుకుని పార్టీని ఎంతో 'బలోపేతం' చేసుకున్నారు. టీఆర్ఎస్ లో ప్రస్తుతానికి అసలు అసమ్మతి అన్న మాటే లేదు. పోనీ ప్రతిపక్షాలు అన్నీ ఏకమై కెసీఆర్ ప్రభుత్వ విధానాలపై ఏమైనా పోరాటాలు చేస్తున్నాయా? అంటే అదీ లేదు. మీడియా అంతా కెసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందా? అంటే అది కలలో కూడా ఊహించని మాట. ఇంత అనుకూలతల మద్య ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏదో తెలియని అంశం గురించి మనోవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇన్ని సానుకూల పరిస్థితుల మద్య ఆడుతూ పాడుతూ పరిపాలించాల్పింది పోయి ఓ పంతులు ఇచ్చిన సలహా పట్టుకుని ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారని తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తోంది.
పంతులు చెప్పిందే పరమావది..! పోలింగ్ బెల్స్ అందుకే ...!
‘డిసెంబర్ 2018లోపు ఎన్నికలు జరిగితే మీకు అంతా మంచే జరుగుతుంది. తిరిగి మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారు.' ఓ పండితుడు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు కు ఇచ్చిన సలహా? అందుకే ఇప్పుడు కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు అంత హడావుడి చేస్తున్నారా?. ఇది ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఎంతో మంది ముఖ్యమంత్రులు తమ పాలన నిర్వహించిన ప్రస్తుత సచివాలయం వాస్తు ప్రకారం లేదని గత నాలుగున్నర సంవత్సరాలుగా అటువైపు కూడా చూడని కెసీఆర్ కు ఇలాంటి నమ్మకాలు ఉంటాయనటంలో ఎలాంటి విచిత్రం.. వింతా లేదు కూడా?. ప్రస్తుతం కెసీఆర్ ముందస్తు ఎన్నికలకు హడావుడి చేయటం వెనక ఇంతకు మించిన బలమైన కారణం కూడా ఏదీ లేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అంతా ఓకే..కాని అల్లుడి నోట్లోనే శని..! అందుకే పోల్ వార్ అంటున్న గులాబీ బాస్..!
ఓ వైపు కంటి వెలుగు, మరో వైపు రైతు బంధు, రైతు భీమా, తెలంగాణ ప్రజల కల అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు...ఇలా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నా..కెసీఆర్ లో ఏదో తెలియని భయం. కేవలం చంద్రశేఖర్ రావు తన ముహుర్త నమ్మకాల ఆధారంగానే ముందస్తు ఎన్నికల విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తున్నారని, అంతకు మించిన బలమైన కారణాలు ఒక్కటంటే ఒక్కటి ఎవరైనా చెప్పగలరా? అని ఓ నాయకుడు ప్రశ్నించారు. సహజంగా ప్రతిపక్షం చాతనైతే ఎన్నికలు పెట్టండి మా సత్తా ఏంటో చూపిస్తాం అని సవాళ్లు విసిరేసందర్బాలు ఉంటాయి తప్ప ఎన్నికల కోసం అదికార పార్టీ ఉరుకులు పరుగులు పెట్టిన సందర్బులు చాలా తక్కువ అనే చర్చ కూడా జరుగుతోంది.
స్పష్టత ఇవ్వనున్న ప్రదాని..! అప్పుడే ఎన్నికల సంబురాలు..!
వాస్తవానికి గత ఢిల్లీ టూర్ లోనే ప్రధాని మోడీతో ఈ అంశంపై చర్చించారని, ఇప్పుడు సీఈసీ అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికల అవసరం ఏముందనే వాదన తెరపైకి తేవటంతో క్లారిటీ కోసమే కెసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారనే వాదన విన్పిస్తోంది. ఒక వేళ సీఈసీ ముందస్తుకు ససేమిరా అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకే మంత్రుల సమావేశంలో ముందస్తు అంటే, ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికల అంశంపై చర్చించామనే వాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మరి కెసీఆర్ కోరుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోపు పూర్తవుతాయా? లేక షెడ్యూల్ ప్రకారమే అన్న సంగతి త్వరలోనే తేలనుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయ వాతావరణం ముందస్తు అంశంతో రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది.
ముందస్తుకు ఏపి నో అంటే ఇబ్బందే..! చంద్రబాబు వ్యూహం పై ఉత్కంఠ..!
పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ఇలాంటి సవాళ్ళే విసురుతుంటుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం రెడీ..కెసీఆర్ ఇంటికి పోవటం ఖాయం అంటూ మాట్లాడటం తప్ప..సవాళ్ళు చేసే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు. అలాంటిది ఎలాంటి పాలనాపరమైన..రాజకీయపరమైన కారణాలు లేకుండా ఎందుకు కెసీఆర్ ముందస్తు కోరుకుంటున్నారు?. అంటే ఖచ్చితంగా ‘ముహుర్త' బలమే అనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నాయకుల ‘ముహుర్తాల' ప్రకారం ఎన్నికలు నిర్వహించటానికి ముందుకు వస్తుందా?. తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.