రేవంత్ కాంగ్రెస్ కు వరమా - శాపమా : బీజేపీ ఆ స్థానంలోకి - కేసీఆర్ కోరుకుంటోంది అదే..!!
తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది..? హస్తం పార్టీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరమా శాపమా..? తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ నాయకత్వంలోనే వెళుతుందా.. టీఆర్ఎస్ను బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కు ఉందా.. సాధారణ కార్యకర్త నుంచి కాంగ్రెస్ సీనియర్ల వరకు తొలుస్తున్న ప్రశ్నలు ఇవే. ఏఐసీసీ ఏం చేస్తోంది. పార్టీ ఇంఛార్జ్.. వ్యూహకర్తను కాదంటూ మరో విశ్వసనీయ సంస్థతో పూర్తి వివరాలు సేకరించింది. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే మనుగడ కష్టమని గుర్తించింది.
కాంగ్రెస్ను వీడుతున్న సీనియర్లు
మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్.. నిన్న దాసోజు శ్రవణ్.. నేడు మర్రి శశిధర్ రెడ్డి.. టైమింగ్ వేరైనా టార్గెట్ మాత్రం రేవంత్ రెడ్డే అన్నట్లుగా వ్యవహరించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ ఆ తర్వాత కాషాయం కండువా కప్పుకున్నాడు. ఆ వెంటనే మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసి హస్తం పార్టీకి హ్యాండిచ్చి కమలం గూటికి చేరారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి కూడా కమలం పార్టీలో చేరుతారా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన మర్రిశశిధర్ రెడ్డి ఒక్కసారిగా రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
రేవంత్ పై ఫైర్ అయిన మర్రి శశిధర్ రెడ్డి
అంతేకాదు ఒకప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి నేతృత్వం వహించిన మర్రిశశిధర్ రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్ పెద్దలపై కాలుదువ్వారు. ఏకంగా రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్నే టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి ఏజెంట్ ఠాగూర్ అని ఎద్దేవా చేశారు. దీంతో మర్రిశశిధర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ హిట్లిస్టులో చేరిపోయారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు తెప్పించుకుందని.. ఏ క్షణమైనా ఈ సీనియర్ నేతకు షోకాజు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డే కారణమా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ వార్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నింది. అయితే తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చేసింది. ఇక టీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిష్ట్ అయ్యింది. అంటే బీజేపీ తెలంగాణలో బలపడేందుకు ఒకరకంగా రేవంత్ వ్యవహరించిన తీరే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా రేవంత్ రెడ్డి చెప్పుచేతల్లోనే ఉన్నారని అధిష్టానానికి సరైన నివేదిక ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ అంటే తన సొంత పార్టీ, తాను ఏం చెబితే అదే జరగాలనే ధోరణి రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. రేవంత్ ఎవరినీ కలుపుకుని పోవడం లేదని అదే సమయంలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నారు తప్పితే..
రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చింది. అక్కడ బలహీనమైన అభ్యర్థి బల్మూరి వెంకట్ను పోటీలో దింపడంతో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. మునుగోడు సీటు కచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక అగ్నిపరీక్షే అని చెప్పక తప్పదు. అయితే సీనియర్లను కలుపుకోకుండా సొంత నిర్ణయాలతో ముందుకెళితే మాత్రం రేవంత్ రెడ్డికి గడ్డుకాలం ప్రారంభమైనట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సమస్యలు పరిష్కరించాల్సిన నాయకుడే పార్టీకి సమస్యగా మారారనే మాటలు రేవంత్రెడ్డిపై కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు తప్పితే గల్లీలో మాత్రం ఫెయిల్ అయ్యారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి
ఇదంతా ఇలా ఉంటే.. కాంగ్రెస్ ప్రస్తుత టార్గెట్ కేసీఆర్ కాదు... రేవంత్ రెడ్డి అన్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవం కూడా ఇదే. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారని సీనియర్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఒంటికాలుపై లేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్లు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా సేవలందించిన దామోదర రాజనర్శింహ సైతం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో యాక్టివ్గా కనిపించడం లేదు. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. ఇక ఈ అసంతృప్తి ఇలానే కొనసాగితే... తమకున్న విలువలతో కచ్చితంగా బీజేపీకి అయితే వెళ్లరు కానీ టీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సీఎం కేసీఆర్ కోరుకునేది కూడా. ప్రత్యర్ధులు బలహీన పడే కొద్దీ.. అధికారంలో ఉన్న పార్టీకి బలం పెరుగుతుంది.
మొత్తానికి పీసీసీ చీఫ్గా సమస్యలు పరిష్కరించి అందరిని ఒక తాటిపైకి తీసుకురావాల్సిన రేవంత్ రెడ్డి, పార్టీకే సమస్యగా మారారనేది స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఈ రోజు దయనీయమైన పరిస్థితిలో ఉందంటే ఇదంతా స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా కొనసాగుతారా అనే అనుమానం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి రేవంత్ సరి దిద్దుకుంటారా.. లేకుంటే అధినాయకత్వమే దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.