పెద్ద ఐటీ కంపెనీలు కుమ్మక్కై శాలరీలు తగ్గిస్తున్నాయి: పాయ్ సంచలనం
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని ఏకమై కొత్తగా ఉద్యోగాలలో చేరే వారికి వేతనాలు తగ్గించి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖులు టీవీ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని ఏకమై కొత్తగా ఉద్యోగాలలో చేరే వారికి వేతనాలు తగ్గించి ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖులు టీవీ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన పీటీఐతో మాట్లాడారు. 'ఇండియన్ ఐటీ పరిశ్రమతో అదే సమస్య. కొత్తగా వచ్చే వారికి ఐటీ రంగం మెరుగైన వేతనాలు ఇవ్వడం లేదు. నిజం చెప్పాలంటే పెద్ద కంపెనీలన్నీ ఒక్కటై ఒకదానితో మరొకటి చర్చించుకొని వారి జీతాలను పెంచకుండా చేస్తున్నార'ని వ్యాఖ్యానించారు.
నేను చాలా కొంటెవాడ్ని, అమ్మాయిలు ఫాస్ట్: అజీం ప్రేమ్ జీ
ప్రాథమిక స్థాయిలో సాఫ్టువేర్ ఇంజినీర్లు అధికంగా వస్తుండటంతో దానిని అవకాశంగా తీసుకుని ప్రారంభ వేతనాల్లో కోత విధిస్తున్నారన్నారు.
తాజా గణాంకాల ప్రకారం రెండు దశాబ్దాల కిందట సాఫ్టువేర్ ఉద్యోగుల ప్రారంభ వేతనం రూ.2.25లక్షలు (వార్షికంగా) ఉండగా, ఇప్పుడది కేవలం రూ.3.5లక్షలకు మాత్రమే పెరిగింది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ మొత్తం.
ఐటీ పరిశ్రమకు ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలను ముఖ్యంగా పెద్ద ఐటీ కంపెనీలు విడనాడాలన్నారు. కంపెనీల్లో ఉన్న పెద్దవాళ్ల వేతనాలల్లో కోత పెట్టడం ద్వారా కొత్తగా వచ్చే వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు.
జీతాలు పెంచని పక్షంలో తెలివైనవారు ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడరని, తద్వారా మంచి ఉద్యోగులను కోల్పోతామన్నారు. మోహన్ దాస్ పాయ్ 1994-2006 మధ్య బెంగళూరు ఇన్ఫోసిస్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పని చేశారు.