డీఎస్ పై యాక్షన్ ప్లాన్ రెడీ - అనర్హతకు వెనుకాడద్దంటూ : ఏం జరుగుతోంది..!!
సీనియర్ పొలిటిషీయన్..రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ పైన టీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్న డీఎస్ కొద్ది కాలం క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఈ నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలు డీఎస్ రాక పైన చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆయన నిర్ణయం పైన ప్రభావం చూపించిందని చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ వరకు డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.

డీఎస్ నిర్ణయాల పై ఫోకస్
రాజ్యసభ సభ్యత్వానికి..టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లో చేరుతారని కొందరు ఆయన మద్దతు దారులు చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పటి వరకు డీఎస్ కాంగ్రెస్ లో చేరే అంశం పైన అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయన సోనియాను కలవటం ద్వారా పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇక, తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో డీఎస్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన సోనియాను కలవటంతో వెంటనే అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకోవాలంటూ కొందరు ఎంపీలు సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ.. ఎప్పుడంటే
డీఎస్ పైన అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేయాలంటూ చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే, జూన్ తో ఆయన పదవీ కాలం ముగియనుండ టంతో...పార్టీ మారకుండా తొందర పడటం అవసరమా అనే కోణంలోనూ చర్చ జరిగింది. అయితే, ఆయన పార్లమెంట్ సమావేశాల సమయంలోనే రాజీనామా చేసి పార్టీ మారితే ఏం చేయాలి..అదే విధంగా... నేరుగా కాంగ్రెస్ లో చేరితే ఏం చేయాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11వ తేదీ వరకు తిరిగి రెండో విడత మార్చిలో జరగనున్నాయి. జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

అనర్హత వేటు వేయాల్సిందేనంటున్న ఎంపీలు
డీఎస్ కాంగ్రెస్లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ తో ఉన్న సంబంధాలతో టీఆర్ఎస్ లో చేరిన డీఎస్..కొంత కాలంగా నిజామాబాద్ కేంద్రంగా సాగిన రాజకీయ పరిణామాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుల్లో ఒకరు కాంగ్రెస్ లో.. మరో కుమారుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయినా... డీఎస్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. తనకు కాంగ్రెస్ లో చేరినా..ఎటువంటి పదవులు వద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, డీఎస్ వేసే అడుగులు.. టీఆర్ఎస్ ప్రతిస్పందన రానున్న రోజుల్లో ఆసక్తి కరంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications