ఫోటోలు: నయీంతో దర్జాగా ఓ ఎమ్మెల్యే, కలిస్తే క్లిక్మనాల్సిందే...
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో రాజకీయ నాయకుల సంబంధాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. నయీంకు నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా దర్యాప్తు అధికారులకు దొరికిన కొన్ని ఫొటోలు ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీంతో కలిసి ఉన్న ఫొటోలు దర్యాప్తు అధికారులకు లభించాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే అంత దర్జాగా నయీంను ఎందుకు కలిశాడనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో కొన్ని విషయాలు వెలుగు చూశాయని, ఆ ఎమ్మెల్యేకు ఉచ్చు బిగిసినట్లేనని మీడియా వ్యాఖ్యానిస్తోంది.
నల్లగొండ జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులకు నయీం పెద్ద యెత్తన ప్రయోజనం చేకూర్చాడని, అయితే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో ఎమ్మెల్సీతో నయీంకు సంబంధాలున్నట్లు తేలిందని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఓసారి టీ చప్పరిస్తూ మరోసారి టిఫిన్ చేస్తూ, మరో రెండు సార్లు కూర్చుని మాట్లాడుతూ ఉన్న నాలుగు ఫొటోలు దర్యాప్తు అధికారులకు చిక్కాయి. షాద్నగర్ డెన్లోనూ మరో రెండు చోట్ల నయీంను ఎమ్మెల్యే కలిసినప్పుడు ఆ ఫొటోలు తీశారని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో నయీంకు వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే నయీం చెంతకు ఎందుకు వెళ్లాడనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
నల్లగొండ జిల్లా
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి నయీంతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. నయీమ్తో ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా దర్యాప్తు అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన భువనగిరి జడ్పీటిసి సభ్యుడు సందెల సుధాకర్ నయీం అనుచరుడనే ప్రచారం ఉంది. నయీం హతం కావడానికి ముందే ఆయన పీడీ యాక్టు కేసులో పోలీసులకు లొంగిపోయాడు.
నయీం
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీంతో కలిసి ఉన్న ఫొటోలు దర్యాప్తు అధికారులకు లభించినట్లు చెబుతున్నారు. కాగా, నయీంను ఎవరు కలిసినా కెమెరా క్లిక్మనాల్సిందేనని చెబుతున్నారు.
నయీం ఎన్కౌంటర్
నయీం ఎన్కౌంటర్ తర్వాత భువనగిరి ఎంపిపి తోటకూర రమేష్, వలిగొంండ ఎంపిపి శ్రీరాముల నాగరాజు, భువనగిరికి చెందిన కౌన్సిలర్ ఎండి నాసర్లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.