రాజయ్య కుటుంబంలో ఘటన దురదృష్టకరం, ప్రభావం చూపదు: జానారెడ్డి
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపి రాజయ్య కోడలు, మనవళ్లు మృతి చెందడం చాలా దృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. వారి మృతి ఆ కుటుంబానికి తీరని వ్యథ మిగిల్చిందని అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న రాజయ్య.. వరంగల్ లోకసభ ఎన్నిల బరి నుంచి తప్పుకున్నారని చెప్పారు. రాజయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషాద ఘటన మాటలతో ఓదార్చలేనిదని, ధైర్యంగా ఉండాలని రాజయ్య కుటుంబసభ్యులకు జానారెడ్డి సూచించారు. రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారని చెప్పారు. రాజయ్య కోడలు, మనవళ్ల అకాల మరణం అందరిని కలచివేసిందని అన్నారు.
ఘటనపై నిజానిజాలు తెలిసన తర్వాతే మాట్లాడాలని అన్నారు. నిర్ణయించిన కార్యక్రమాలను ముగించి ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉందని అన్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలని అన్నారు.
రాజయ్య కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఘటన కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపదని చెప్పారు.ఇది వ్యక్తి సంబంధించిన విషయమని, ఎన్నికలు ప్రజలకు సంబంధించిన విషయమని జానారెడ్డి తెలిపారు. కాగా, రాజయ్య ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది.