'కోటి' చొప్పున డిపాజిట్లు.. ఎలా వచ్చాయి? ఆ వంద ఖాతాలపై ఐటీ నిఘా!
నోట్ల రద్దు తర్వాత దాదాపు 100 జీరో అకౌంట్స్ లో.. ఒక్కొక్క ఖాతాలో రూ.కోటి కన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ అయినట్టుగా గుర్తించామని తెలిపారు.
హైదరాబాద్: నగరంలోని ఐ-టీ(ఇన్కమ్ టాక్స్) కార్యాలయం కేంద్రంగా భారీ ఆపరేషన్ కు అధికారులు స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటన తర్వాత ఆయా బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బు డిపాజిట్ అయింది. ఈ డిపాజిట్లపై అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు.
దీనిపై ఐటీ అధికారి ఒకరు మంగళవారం నాడు స్పందించారు. నోట్ల రద్దు తర్వాత దాదాపు 100 జీరో అకౌంట్స్ లో.. ఒక్కొక్క ఖాతాలో రూ.కోటి కన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ అయినట్టుగా గుర్తించామని తెలిపారు.
ఈ ఖాతాల్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడినుంచి వచ్చి చేరింది? అనేదానిపై ప్రస్తుతం తాము కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఒకవేళ ఆ ఖాతాల్లోని డబ్బుకు ఖచ్చితమైన ఆధారాలు గనుక ఉంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని చెప్పారు. కానీ ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా.. ఏమాత్రం అనుమానస్పదంగా అనిపించినా.. వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఐటీ గుర్తించిన జీరో అకౌంట్స్ ఖాతాల్లో చాలావరకు రద్దైన రూ.500, రూ,వెయ్యి నోట్లు జమ అయినట్టుగా గుర్తించామన్నారు. ఈ ఖాతాలను పరిశీలించడానికి 30మంది ఇన్ స్పెక్టర్లను అదనంగా నియమించినట్టు తెలిపారు. అధికారులు గుర్తించిన ఖాతాలను ఈ ఇన్ స్పెక్టర్ల టీమ్ నిశితంగా పరిశీలించి.. వాస్తవాలను ధ్రువీకరించనుంది.