అంతే.. ఇన్నేళ్లలో తెలంగాణకు ఒకే ఒక్క రైలు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టం చెబుతోందని, కానీ ఇంతవరకు అతీగతీ లేదన్నారు. మరిన్ని రైల్వే లైన్లు ఏర్పాటుచేసి రైల్ కనెక్టివిటీ పెంచాలని తమ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు.
దక్షిణ మధ్య రైల్వేకు తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధిక ఆదాయం లభిస్తోందని గుర్తు చేశారు. సరుకుల రవాణాతోపాటు ప్రయాణికుల టికెట్ల నుంచి కూడా భారీగా రాబడి వస్తోందని, సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్లు ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో అనుసంధానిస్తున్నాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లింగంపల్లి-విజయవాడ పేరుతో ఇంటర్ సిటీ రైలును ప్రవేశపెట్టారని, ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణకు కేటాయించిన రైలు ఆ ఒక్కటేనని గుర్తుచేవారు.
దేశంలో మొత్తంమీద ఉన్న రైల్వే నెట్ వర్క్ లో కేవలం మూడుశాతమే తెలంగాణ కలిగివుందని, ఇందులో 57 శాతం కేవలం సింగిల్ ట్రాక్ మాత్రమేనన్నారు. గతంలో రైల్వే జోనల్ మేనేజర్లు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ సౌకర్యాలు కల్పించాలి? ఏయే రూట్లలో రైళ్లుండాలి? లాంటి విషయాలన్ని అడిగి వివరాలు తీసుకునేవారని, ఆ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. ఉమ్మడి భాగస్వామ్యంలో కేంద్రంతో చేపట్టిన రైల్వే లైన్ ల విషయంలోనూ తమ ప్రభుత్వం రూ. 1,904 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం కేవలం రూ. 1,100 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు