హైదరాబాద్లో మళ్ళీ ఐటీ దాడులు; 40కార్లలో వెళ్లి ...ఎక్సెల్ గ్రూప్ కంపెనీలో సోదాలు; టెన్షన్!!
హైదరాబాద్ లో మళ్లీ ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నుండే ఐటి దాడులు మొదలయ్యాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఐటీ సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం 40 కార్ లలో, 3 సిఆర్పిఎఫ్ బస్సులలో ఐటీ సిబ్బంది దాడులు కొనసాగిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఐటీ దాడులు
ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధానంగా చెన్నై కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఆ కంపెనీ కి అనేక చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. ఇక ఈ కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ లపై ఐటి దాడులు కొనసాగిస్తున్న అధికారులు ప్రస్తుతం గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న ఆఫీసులో సోదాలు కొనసాగిస్తున్నారు. కంపెనీకి చెందిన డైరెక్టర్ ల ఇళ్ళలో కూడా సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగడంతో ఎవరెవరి పైన దాడులు కొనసాగిస్తారు అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

హైద్రాబాద్ లో ఐటీ దాడులతో వాళ్లకు వెన్నులో వణుకు
ఇప్పటికే అనేక మార్లు హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఐటి దాడులతో ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎవరి పైన దాడులు జరుగుతాయో అర్థంకాని పరిస్థితిలో తీవ్రంగా భయపడుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐటి సోదాలు దేనికి సంబంధించి జరుగుతున్నాయి. ఎవరిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నాయి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కాలేజీలు, వ్యాపారాలపై ఐటీ దాడులు
ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటుగా, ఆయన వ్యాపార సంస్థలు, కళాశాలలపైనా ఐటి దాడులు కొనసాగాయి. ఏకంగా రెండు రోజుల పాటు జరిగిన ఐటి దాడులు తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించగా, ఆపై ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. ఈ తనిఖీలలో భారీ ఎత్తున నగదును బంగారు ఆభరణాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు, లెక్కల్లో చూపించిన 20 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని కూడా సీజ్ చేశారు.

మంత్రి గంగుల, గాయత్రి రవి, వంశీ రామ్ బిల్డర్స్ పైనా ఐటీ ఎటాక్
ఇక అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఇళ్ళు, ఆఫీసులలో కూడా ఐటి దాడులు కొనసాగాయి. ఇక ఇటీవల వంశీ రామ్ బిల్డర్స్ పైన కూడా ఐటీ దాడులు నిర్వహించారు. దీంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఐటీ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ రోజు భారీ సంఖ్యలో ఐటీ అధికారులు కొనసాగిస్తున్న దాడులలో ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications