పంచాయితీనే కానీ పార్లమెంట్ కన్నా మంచి నిర్ణయం .. మహిళలను వేధిస్తే ....
మహిళలతో అమర్యాదగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేయడం, ఇబ్బంది పెట్టడం ఈ మధ్యకాలంలో తెగ పెరిగిపోయింది. అయితే మహిళల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం తీసుకుంది. పేరుకే గ్రామ పంచాయతీ అయినా పార్లమెంట్ కంటే గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇంతకీ మహిళల విషయంలో ఆ గ్రామం తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ గ్రామం ఎక్కడ ఉంది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
ఉచిత స్కూటీ పథకం .. మీ సేవా కేంద్రాల వద్ద మహిళల క్యూ .. ఫేక్ న్యూస్ అంటున్న అధికారులు
తెలంగాణాలోని ఓ చిన్న గ్రామపంచాయితీ మహాల రక్షణ కోసం తీసుకున్న సంచలన నిర్ణయం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో మహిళల రక్షణ కై గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ మహిళ కావడంతో ఆమె గ్రామంలో మహిళల పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేది లేదంటూ ప్రకటన చేశారు. ఆడపిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని గ్రామంలో ఉండనిచ్చేది లేదని నిర్ణయం తీసుకున్నారు. బాలికలు ,మహిళల తో గౌరవంగా మాట్లాడాలని, ఎవరు అసభ్యంగా ప్రవర్తించిన గ్రామం నుంచి వెలివేసి పోలీసులకు అప్పగించిన శిక్ష పడేదాకా పోరాడతామని వారి తేల్చి చెప్పారు. గ్రామంలో ఉన్న మహిళలు మరియు బాలికల పట్ల ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా గ్రామ మహిళలకు, ఆడపిల్లలకు అండగా ఉంటామని గ్రామపంచాయతీ వేదికగా తీర్మానం చేశారు.
మహిళలను వేధిస్తే ఊర్లోఉండనివ్వమని తీర్మానం .. కానుకుంట గ్రామపంచాయితీ సభ్యుల ప్రమాణం
మహిళల భద్రత కోసం గ్రామంలో అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన కానుకుంట పంచాయితీ నిర్ణయాన్ని రాష్ట్రం మొత్తం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు , పట్టణాలు అన్న తేడా లేకుండా విపరీతంగా బాలికల పైన, మహిళలపైన లైంగిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఊరిలోనూ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే కొంత మేరకు మహిళల సంరక్షణ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇక కానుకుంట గ్రామపంచాయతీ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించిన పంచాయితీ సభ్యులు ఆ తీర్మానానికి కట్టుబడి పని చేస్తామని గ్రామ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు.
సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన గ్రామం ... దేశానికే ఆదర్శం
ఇటువంటి నిర్ణయాల వల్ల సమాజంలో కచ్చితంగా మార్పు వస్తుందని పలువురు గ్రామపంచాయతీ తీర్మానం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, పోకిరీల బెడద నుంచి మహిళలను ఆడపిల్లల్ని రక్షించడానికి సంగారెడ్డి జిల్లాలోని ఓ కుగ్రామం చేసిన ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం కావాలి. ఈ తరహా నిర్ణయం ప్రతి గ్రామంలోనూ తీసుకుంటే మహిళల మరియు చిన్నారుల రక్షణ బాధ్యతను ఆ గ్రామాల ప్రజలు నిర్వర్తిస్తే, కొంతమేరకు సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఓ చిన్న కుగ్రామమైన, అతి చిన్న గ్రామ పంచాయతీ అయినా దేశం మొత్తం ఆలోచించేలా మహిళల రక్షణ విషయంలో నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకుంది కానుకుంట గ్రామం.