మంత్రి పువ్వాడ అజయ్ ఉద్యమకారుడా! దమ్ముంటే నన్ను డిస్మిస్ చెయ్యండన్నఅశ్వద్ధామరెడ్డి
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తామని చెప్తున్న ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరు కాకుంటే ఎస్మా ప్రయోగిస్తాం.. విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంపై ఆయన మండిపడుతున్నారు. దమ్ముంటే తనను డిస్మిస్ చేయాలని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు.
సీఎంతో త్రిసభ్య కమిటీ సభ్యుల భేటీ, ఆర్టీసీ డిమాండ్లపై వివరణ, ప్రత్యామ్నాయాలు ఇవే..
మంత్రి పువ్వాడపై మండిపడిన అశ్వత్థామ రెడ్డి
తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు సైతం పాలు పంచుకున్నారని గుర్తు చేసిన అశ్వత్థామరెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.ఆర్టీసీ కార్మికులంతా ఉద్యమకారులని స్పష్టం చేశారు. ఇక అంతే కాదు రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పువ్వాడ ఎన్నడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని మండిపడ్డారు జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి. అలాంటి మంత్రి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏ మాత్రం పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చెప్పి 36 రోజులైనా సమస్యల పరిష్కారం కాలేదు
తెలంగాణ కోసం తాము పోరాటం చేశామని చెప్పిన ఆయన సమ్మెకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.గతంలో సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పడతామని ప్రభుత్వానికి తెలియజేసి 36 రోజులైనా సర్కారు ఒక్క సమస్యయినా పరిష్కరించలేదన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో అనేకసార్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, ఇప్పుడు ఇచ్చిన మాటను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అని అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు .
ఆర్టీసీ కార్మికుల కోసం సబ్బండ వర్ణాలు ఉపక్రమిస్తాయని హెచ్చరిక
ఉద్యోగాలు పోయినా పరవాలేదు కానీ ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరు కారన్నారు. మొత్తం 50 వేల మంది కార్మికులు సమ్మెలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న ఈ సమ్మె ఆర్టీసీ వరకే పరిమితం కాదని తమ కోసం సబ్బండ వర్గాలు సమ్మెకు ఉపక్రమిస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదన్న అశ్వద్ధామ రెడ్డి ఇది రాష్ట్ర విభజన కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీలాంటిదే అని ధ్వజమెత్తారు.
2 లక్షల ఆర్టీసీ కార్మిక కుటుంబాలు జైలుకు వెళ్లేందుకు సిద్ధం అన్న జేఏసీ
సమ్మెకు దిగితే ఎస్మాను ప్రయోగిస్తామని, డిస్మిస్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇలాంటి బెదిరింపులకు, నిరంకుశత్వానికి భయపడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏపీఎస్ఆర్టీసీ అన్ని ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తున్నట్లుగా ప్రాథమిక ప్రకటన చేసి, తర్వాత విధి విధానాల రూపకల్పనకు సమయం తీసుకోవాలని కోరామన్నారు. దానికీ కమిటీ అధికారులు ఎలాంటి భరోసా ఇవ్వలేదని పేర్కొన్నారు. తన సమస్యల సాధన కొరకు సంస్థలోని 50 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 2 లక్షల మంది జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. డిస్మిస్ చేస్తామని భయపెడితే ప్రభుత్వానికి కార్మికుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి హెచ్చరించారు.