4 ఏళ్లు కేసీఆర్ను ఏమీ అనను: కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్, చేతులెత్తేశారా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆశలను సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వమ్ము చేస్తున్నారా? తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, డీకే అరుణ, సంపత్ కుమార్ వంటి నేతలు లేని లోటును తీరుస్తారనుకుంటే చేతులెత్తేశారా? అంటే ఆయన మాటలను బట్టి అవుననే అర్థమవుతోందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 19 స్థానాలకే పరిమితమైంది. ఆ స్థానాలైన పర్వాలేదు.. సీనియర్ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని సమస్యలపై గట్టిగా ఢీకొడతారా అంటే ఆ సీనియర్లు మూకుమ్మడిగా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య వంటి హేమాహేమీలు ఓడిపోయారు. దీంతో అందరి చూపు జగ్గారెడ్డి వైపు మరలింది.

చేతులెత్తేసిన జగ్గారెడ్డి
అసెంబ్లీలో జగ్గారెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్ తరఫున కేసీఆర్కు ముచ్చెమటలు పట్టిస్తారని, వీరంతా ఉన్నా ఒకటే.. జగ్గారెడ్డి ఒక్కడు ఉన్నా ఒక్కటేననే వాదనలు వినిపించాయి. కానీ ఆయన మాత్రం ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. తాను కేసీఆర్ పాలనపై నాలుగేళ్లు వేచి చూస్తానని చెప్పడం గమనార్హం. దీంతో ఆయన ప్రజా సమస్యలపై ఏమాత్రం గళమెత్తుతారనే చర్చ సాగుతోంది. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో ముందుకు
సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని మతాల వారు తనకు ఓటు వేసి గెలిపించారని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని అందరూ భావించారని, కానీ ప్రజలు మాత్రం తెరాసకు మరోసారి అవకాశం ఇచ్చారని చెప్పారు. తనకు ఓటు వేసి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు.

సహకరించకపోయినా నాలుగేళ్లు ఏమీ అనను
తనకు సహకరించినా, సహకరించకపోయినా వచ్చే నాలుగేళ్ల వరకు ప్రభుత్వం, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటింటికీ మంజీరా నీటి సరఫరా, విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కోరుతానని అన్నారు.
నియోజకవర్గ సమస్యలను లేఖల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తన ప్రతిపాదనలను తిరస్కరిస్తే సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తానన్నారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారను
తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మాత్రం మారేది లేదని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాజకీయంగా తనను అణగదొక్కే ప్రయత్నం చేశారన్నారు. కానీ విఫలమయ్యారని మండిపడ్డారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కేసీఆర్ను సైతం అభినందిస్తానని చెప్పారు. ఈ నెల 17న సంగారెడ్డిలో లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications