ఇంత భక్తా.. 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లిన దంపతులు
భారతీయ సంస్కృతిలో దైవాన్ని ఆరాధించడం విశిష్టమైనదిగా చెబుతుంటారు. కష్టమైనా సుఖమైనా దేవుడితో మొరపెట్టుకుంటారు. దేవుడ్ని కోరికలు కోరుతుంటారు. అవి తీరితే మోకాళ్ల మీద వస్తామని.. సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తామని.. తల నీలాలు సమర్పిస్తామని ఇలా ముక్కులు చెల్లించుకుంటారు. అయితే ఓ జంట ఏకంగా 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరీ ఇంత భక్తా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. వందలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ జంట తమ మొక్కులను విశేషంగా తీర్చుకుంది. ఆ దంపతులు ఏకంగా 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పరిధిలోని రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేష్, శారద దంపతులు వినూత్నంగా దేవుడిపై తమ భక్తిని ప్రదర్శించారు. మొక్కులు తీర్చుకునేందుకు 5 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. దాంతో రోడ్డుపై ప్రజలంతా ఆ దంపతుల భక్తిని చూస్తూ ఉండిపోయారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనంతరం ఆ దంపతులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ గ్రామస్థులంతా వారి భక్తిని కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications