బిజెపి, టిడిపి అత్యవసర భేటీకి జానా హాజరు: ఒక్కటవుతున్నారా?
హైదరాబాద్: ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, 11 మంది సభ్యులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాజకీయాలు తీవ్రమైన మలుపు తిరుగుతున్నాయి. సభలోని పరిణామాలపై, సస్పెన్లపై చర్చించడానికి బిజెపి, తెలుగుదేశం సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఆ అత్యవసర సమావేశానికి కాంగ్రెసు శానససభా పక్షం (సిఎల్పీ) నేత కె. జానారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం సభకు హాజరు కాకూడదని టిడిపి, బిజెపి సభ్యులు నిర్ణయించుకున్నారు.
కాంగ్రెసు సభ్యులపై స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న చర్యల తీరును బిజెపి పక్ష నేత జి. కిషన్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తప్పు పడుతున్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డిని కూడా సస్పెండ్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా ఏకమవుతాయా అనే ప్రశ్న ఉదియిస్తోంది. తమ శాసనసభ సభ్యత్వాలకు మూకుమ్మడి రాజీనామాలు చేసే దిశగా కాంగ్రెసు సభ్యులు ప్రయాణం చేస్తున్నారు.
కాంగ్రెసు సభ్యులు రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో మినీ సాధారణ ఎన్నికలను తలపించే ఉప ఎన్నికలు జరుగుతాయి. దీన్నే కాంగ్రెసు నాయకులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.