తెలంగాణను ఆంధ్రలో కలుపుతాం: బలరాం నాయక్, కెటిఆర్పై జానా ఫైర్
వరంగల్: వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతామని బెదిరించారు. వేదికపై ఉన్న నేతలు వారించేందుకు ప్రయత్నించగా ఆ ఏం కాదు.. కలిపితే తప్పేమున్నది.. ఏం కాదని అన్నారు. మాజీ ఎంపీ బలరాం నాయక్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జానెడు పనిచేయడం కెటిఆర్కు తెలియదని, కాంగ్రెసు చేసిన పని కెటిఆర్కు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు.
రైతాంగం అప్పుల్లో కూరుకుపోయిందని జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో రైతులు కష్టాలు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. రుణమాఫీని ఒకేసారి చేయాలని జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం రైతు సంక్షేమం కంటే కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రూ. 8500 కోట్లు చెల్లిస్తే రాష్ట్ర రైతాంగం రుణవిముక్తి అవుతుందని, అయితే ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. శుక్రవారం జిల్లాలోని నర్సంపేటలో రైతు భరోసాయాత్ర సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో ఇంతపెద్ద ఎత్తున రైతులు మరణిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆరోపించారు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రైతు రుణాలు చెల్లించాలని కోరితే అలవిగాని కోరికలంటూ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలను గెంటేశారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అప్పటి అధికారపక్షం కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పాల్గొన్నాయని, ఉద్యమంలో పాల్గొనలేదని కేటీఆర్ చెప్పగలరా అని టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే ఇన్నాళ్లు మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు. డబుల్బెడ్రూం ఇళ్లతో సహా చాలా సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి సహాయం అందుతోందని ఆయన వెల్లడించారు.