ఆయనే రాహుల్ను కలిశారు, అవసరం కోసం గతంలో కేసీఆర్తోను కలిశారు: బాబుపై జానారెడ్డి షాకింగ్
హైదరాబాద్: మహాకూటమిలో పొత్తు వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి శుక్రవారం తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని, రేపు సీట్లను ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరగదని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ఎవరు సీఎం అయినా అభ్యంతరం లేదన్నారు.
ముఖ్యమంత్రి పదవి, హరీష్ రావుపై వంటేరు వ్యాఖ్యలు, విభేదాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు నేతలు, వారి అనుచరులు గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపిన నేపథ్యంలో ఆయన స్పందించారు. గతంలో కేటాయించినట్లుగానే ఇప్పుడు కూడా సీట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
సీట్లపై పూర్తి స్పష్టత రాలేదు
పొత్తులపై పూర్తిగా స్పష్టత రాలేదని జానా చెప్పారు. రేపు సాయంత్రానికి సీట్లు ఫైనల్ అవుతాయని జానారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి, తమ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు సీటును క్లియర్ చేశామని చెప్పారు. కూటమిలో భాగంగా ఆయా పార్టీలకు కావాల్సిన సీట్లను వారు అడిగారని, కానీ మాకు కూడా ముఖ్యమైనవి కూడా ఉంటాయని చెప్పారు. కుటుంబంలో ఒకే సీటు అనే నిబంధన ఉందని, సందర్భాన్ని బట్టి అది మారుతుందని చెప్పారు.
సంప్రదింపులు జరుపుతున్నాం
సీపీఐకి మూడు నాలుగు సీట్లు రావొచ్చునని జానారెడ్డి తెలిపారు. పరిస్థితులను బట్టి సీట్ల సంఖ్య పెరగడం, తరుగుతుందని చెప్పారు. పొత్తులో పరస్పర సహకారం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలు రావడం, కూటమి ఏర్పాట కావడంతో సీట్ల ప్రకటనలో కాస్త ఆలస్యమైందని చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
కేసీఆర్తో పోలిక అవసరం లేదు
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా జానారెడ్డి విమర్శలు గుప్పించారు. అకారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడా లేదన్నారు. తాను కేసీఆర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ ఎవరెవరి వద్దకో వెళ్లారని, అదంతా వట్టిదేనని తాము గతంలోనే చెప్పామని, అది నిరూపితమైందని చెప్పారు. దేశంలోని కీలక నేతలను ఆయన కలవలేకపోయారన్నారు. ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టి, ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు.
అవసరం కోసం గతంలో కేసీఆర్తో కలిశారు
మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేతిలో జుత్తు ఉంటుందని తెరాస నేతలు ఆరోపించడంపై జానారెడ్డి స్పందించారు. చంద్రబాబు తెలంగాణ పాలనలో జోక్యం చేసుకోరని చెప్పారు. అలాంటి అవసరం కూడా లేదన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునే హక్కు కూడా ఉండదని చెప్పారు. చంద్రబాబును కలిసేందుకు తాము వెళ్లలేదని చెప్పారు. చంద్రబాబే వచ్చి రాహుల్ గాంధీని కలిశారన్నారు. గతంలోను ఆయన అవసరం కోసం కేసీఆర్తో కలిశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంటల్గా ఢిల్లీలో కలిశామని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్నాడని, అలాగే టీడీపీతో పొత్తు ఉందని, అందుకే కలిశామని చెప్పారు. దేశ అవసరాల దృష్ట్యా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు.