బుద్ధి చెప్పాలి: కేసీఆర్పై జానా ఆగ్రహం, అవి భోజనం చేసేందుకే: భట్టి
హైదరాబాద్: ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన సభా పక్ష నేత జానా రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
దిల్సుఖ్ నగర్లో నిర్వహించిన ఈ ధర్నాలో జానారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, కొప్పుల రాజీ, సబితా ఇంద్రా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానా రెడ్డి మాట్లాడారు.
తమ హయాంలో విద్యార్థులు అడగకుండానే ఫీజు రీయింబర్సుమెంట్స్ విడుదల చేశామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆరోపించారు. ప్రభత్వానికి విద్యార్థులు బుద్ధి చెప్పాలని జానా రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో విద్యారంగంలో సంక్షోభం తలెత్తిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రూ.3,200 కోట్ల బకాయిలు చెల్లించక పోవడంతో వందలాది కళాశాలలు మూసివేతకు సిద్ధమయ్యాయన్నారు. రీయింబర్సుమెంట్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు. విడుదల చేసే దాకా తమ పోరాటం ఆగదని చెప్పారు.
రీయింబర్సుమెంట్స్ వెంటనే విడుదల చేయాలని షబ్బీర్ అలీ అన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా సుప్రీం కోర్టు తీర్పు ఉందన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు.
విద్యార్థుల ఆందోళన పైన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారన్నారు. కూర్చొని భోజనం చేయడానికే మంత్రివర్గ సమావేశాలు అని ఎద్దేవా చేశారు. తెరాస హయాంలో విద్యా వ్యవస్థ దిగజారిందని కొప్పుల రాజు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతామని చెప్పారు.