నన్నే అంటారా: సొంత నేతలపై జానారెడ్డి రుసరుస, ప్రజలు సంతోషంగా: కేసీఆర్
హైదరాబాద్: సీఎల్పీ భేటీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి వ్యాఖ్యల పైన చర్చ జరిగింది. అదే సమయంలో ఆయన పార్టీ నేతల పైన రుసరుసలాడారు. ఇటీవల పలుమార్లు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థించినట్లుగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం నాటి సిఎల్పీలో చర్చకు వచ్చింది.
జానా రెడ్డి తీరు పైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు. ఆయనసరిగా మాట్లాడాల్సి ఉండాల్సిందని కొందరు, ఆయన చెప్పిన దాంట్లో తప్పులేకున్నా వేరే అర్థం వచ్చేలా మాట్లాడమే సమస్య అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. నేతల వ్యాఖ్యల పైన జానా రుసరుసలాడారని తెలుస్తోంది.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను అంటే పార్టీని అన్నట్లేనని ఆయన అన్నారు. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో రూ.5 భోజనాన్ని ప్రశంసించారు. నయీం ఎన్కౌంటర్పై ప్రభుత్వాన్ని పొగిడారు. ఇటీవల మహారాష్ట్రతో తమ హయాంలో ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు వరుసగా దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీలో ఎలా వ్యవహరించారనే విషయమై కూడా సీఎల్పీలో చర్చించారు.

కొత్త జిల్లాలపై ప్రజల సంతోషం: కేసీఆర్
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎక్కువ మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శాఖలవారీగా అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిపై కమిటీ అధ్యయనం చేయనుందన్నారు.
జోనల్ వ్యవస్థ రద్దు నేపథ్యంలో ఉద్యోగుల పదోన్నతులు, హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. అదనపు సిబ్బంది ఎక్కడ అవసరమో గుర్తించాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్మాణాత్మకంగా జరగాలని, ప్రజలకు ఇబ్బంది కలగరాదన్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలన్నారు.
పరిపాలన విభాగాలకు సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలను సీఎస్కు అందించాలని ఆదేశించారు. కొత్త జిల్లాల ముసాయిదా పైన అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. టాస్క్ఫోర్స్ కమిటీ కలెక్టర్లతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications