హడావుడిగా వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్: కొత్తగూడెం.. జనసేనానికి 'మెగా' ఛాన్స్
హైదరాబాద్/ఖమ్మం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభలో బుధవారం కొంత గందరగోళం ఏర్పడింది. తెలంగాణలో పవన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గందరగోళం ఏర్పడింది.
Recommended Video

ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. పవన్ ప్రసంగిస్తుండగా ఆయనను కలిసేందుకు అభిమానులు వచ్చారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ కారణంగా పవన్ అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రసంగం ముగించి వేదిక నుంచి హడావుడిగా వెళ్లిపోయారని అంటున్నారు.

పవన్కు అక్కడే సంతోషం
పవన్ కళ్యాణ్ చలోరే చలోరే చల్ యాత్రపై జబర్దస్త్ హైపర్ ఆది స్పందించారు. కళ్యాణ్ అన్నయ్య జనంలో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాడని, ఇంకెక్కడా సంతోషంగా ఉండలేడని, జనంలో ఉంటా.. జనంలా ఉంటా అని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

మెగా అభిమానులు ఎక్కువ
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కొత్తగూడెంపై ప్రత్యేక ప్రేమ కనబరిచినట్లుగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో ఉన్న పవన్ పలువురు నాయకులతో భేటీ అయ్యారు. ఇక్కడ బస చేయడం వ్యూహాత్మకమే అంటున్నారు. ఇక్కడ మెగా అభిమానుల సంఖ్య ఎక్కువ. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కొత్తగూడెం నియోజకవర్గంలో గట్టి పోటీని ఇచ్చింది.

నాడు భారీగా ఓట్లు చీల్చిన పీఆర్పీ అభ్యర్థి
ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ఎడవల్లి కృష్ణ దాదాపు 39వేల ఓట్లు రాబట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, నాటి మంత్రి వనమా వెంకటేశ్వర రావుకు స్వయానా తోడల్లుడు అయిన కృష్ణ భారీగా ఓట్లను చీల్చారు. దీంతో 45వేలకు పైగా ఓట్లతో వనమా రెండో స్థానానికి పరిమితం అయ్యారు. సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివ రావు 2వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

పవన్కు ఇక్కడ అండ
2009 ఎన్నికల ప్రచారం సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్లలో ఎవరో ఒకరు మరోసారి ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం అప్పుడు వ్యక్తమైంది. పీఆర్పీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధించేవారని భావించారు. ఇక్కడ పవర్ స్టార్కు పెద్ద ఎత్తున అభిమానులు, సామాజిక వర్గం అండ ఎక్కువ అంటున్నారు.

కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి సారిస్తే
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోను పోటీ చేయాలని జనసేన భావిస్తున్నారు. కొత్తగూడెంపై శ్రద్ధ పెడితే ఇక్కడ జనసేన విజయ అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా భావిస్తున్నారు.

పవన్కు అలా చెప్పుకునే అవకాశం
ప్రస్తుతం ఇక్కడ తెరాస నుంచి జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తమ ఆశలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నారనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే కొత్తగూడెంలో రసవత్తర పోరు ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తెలంగాణలో జనసేన బలంగా ఉండే స్థానాల్లో కొత్తగూడెం ఒకటి అంటున్నారు. పవన్ ఇలాగే వ్యూహాత్మకంగా వెళ్తే.. తెలంగాణలో పోటీ చేస్తే కొత్తగూడెంలో గెలుస్తారని అంటున్నారు. అంతేకాదు, ఇక్కడ అభ్యర్థిని నిలపడం ద్వారా తెరాసతో లాలూచీ పడలేదని చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications