రేవంత్ నోరు అదుపులో పెట్టుకో... జానారెడ్డికి అసలు పోటీ చేయడమే ఇష్టం లేదు... : గుత్తా సుఖేందర్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీని ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్... ఓ భజన బ్యాచ్ను తన వెంటేసుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులెవరూ తెలంగాణ కోసం కొట్లాడలేదని... అధికారం రాలేదన్న బాధ తప్ప తెలంగాణ అభివృద్ది మీద ఆ పార్టీకి సోయి లేదని మండిపడ్డారు. గురువారం(ఏప్రిల్ 15) నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
జానారెడ్డికి అసలు పోటీ చేయడం లేదు : గుత్తా
నిజానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయడం జానారెడ్డికి ఇష్టం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. కేవలం పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకే ఆయన పోటీ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా సాగర్ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.సాగర్ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎంతో కృషి చేశారని, ఆయన కుమారుడు నోముల భగత్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.
జానారెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ లేదు : గుత్తా
ప్రస్తుతం తాను శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ... సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తనపై మాట్లాడుతున్నారని... అందుకే తాను కూడా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎన్నడూ ఉండబోదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న బాధ ఆ పార్టీని వెంటాడుతోందని... అంతే తప్ప తెలంగాణ అభివృద్ధిపై వారికి పట్టింపు లేదని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నా...కాంగ్రెస్ నాయకులు దురాశతో విభేదించారని ఆరోపించారు.
Recommended Video
నేటితో ప్రచారానికి తెర...
కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరసే డేంజర్ అంటూ సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. శాసనసభను రేవ్ పార్టీగా మార్చారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. కల్లు కాంపౌండ్లా మారిన శాసనసభలోకి జానారెడ్డి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు వెనుక కమర్షియల్ కోణం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఆరోపణలకు గుత్తా కౌంటర్ ఇచ్చారు. కాగా,సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5గంటలకు ప్రచార పర్వం ముగుస్తుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.