కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోయారా?.. టీఆర్ఎస్ 'బ్రోకర్ పార్టీ'?: జానారెడ్డి
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ అధికార-ప్రతిపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. నిత్యం రాజకీయ సవాళ్లు, విమర్శలతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి 'లోఫర్' అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద చిచ్చే పెట్టాయి. కాంగ్రెస్ నుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలైంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులు.. తమ నోటికి మరింత పని చెబుతున్నారు.

కేటీఆర్ దిగజారుడు తనం: జానారెడ్డి
సభ్యతతో మెలగాలని అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. కానీ, వారి తీరులో మాత్రం మార్పు లేదు. కేటీఆర్ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. రాజకీయాల్లో సంస్కారం ముఖ్యమని పదేపదే చెబుతూనే వస్తున్నా. ఎదుటోళ్లను చులకన చేసినంత మాత్రానా ఏదో గొప్ప చేశామనుకోవడం మంచిది కాదు.

బ్రోకర్ పార్టీ అని మేమంటే..:
మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం. కాంగ్రెస్ లోఫర్ అన్నప్పుడు... ప్రతిగా టీఆర్ఎస్ పార్టీని బ్రోకర్ పార్టీని అని ఎవరైనా అంటే?.. కేవలం మీడియాలో హైలైట్ అవడం కోసమే కేసీఆర్, కేటీఆర్ ఈవిధంగా రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మా కాంగ్రెస్ నాయకులను మాత్రం అసభ్య పదజాలం వద్దని నేను సూచిస్తున్నా.

కాళ్లు పట్టుకున్న సంగతి..:
తెలంగాణ కోసం ఆనాడు కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోయి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాలిగోటితో పోలుస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకపోవడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీని పప్పు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.

ఉన్నమాటంటే ఉలుకెందుకు: కర్నె ప్రభాకర్
జానారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పందించారు. తమ నాయకుల వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఉన్నమాటంటే కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకనీ అన్నారు.
ప్రజలు వాడే భాషనే మంత్రి కేటీఆర్ వాడారని, ఆయన కాంగ్రెస్ గురించి చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం అని అన్నారు. నిజాలు మాట్లాడితే వారికి సహించటం లేదన్నారు. ఇక తెలంగాణకు కేసీఆర్ బాహుబలి అయితే.. కాంగ్రెస్ నేతలు కాలకేయ సైన్యంలా మారిందని కర్నె ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications