తెలంగాణలో పోటీకి సిద్ధమైన జనసేన
తెలంగాణలో పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జనసేన చేస్తోంది. తెలంగాణలో కూడా పోటీచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి అధినేతకు నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
ఏపీలో పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న జనసేన తెలంగాణలో కూడా పోటీకి సిద్ధమైంది. మరోవైపు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణలో జనసేన ఎవరి ఓటు చీలుస్తుంది? ఏపీలో బీఆర్ఎస్ ఎవరి ఓటు చీలుస్తుంది? అనే విషయంలో విశ్లేషకులు సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు తమ పార్టీ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తేకానీ ఇక్కడి పరిస్థితి ఏమిటనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో జనవాణి కార్యక్రమంలో పార్టీ ఇమేజ్ ను పెంచిన పవన్ తెలంగాణలో పోటీచేస్తున్నట్లు గతంలోనే స్పష్టం చేశారు. ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేది తర్వాత వెల్లడిస్తామన్నారు. కొండగట్టు నుంచి తెలంగాణ రాజకీయం మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 1947లో కర్నూలులో మనం జెండా ఎగరవేశామని, 1948లో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని, రజాకార్ల దాష్టీకంతో ప్రజలు నలిగిపోయారన్నారు. శ్రీకాంతాచారితో సహా వెయ్యి మంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు.












Click it and Unblock the Notifications