ఫ్యూచర్ సిటీలో జపాన్ కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్, 30 వేల ఉద్యోగాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజే భారీ పెట్టుబడులను ఆకర్షించింది. జపాన్కు చెందిన దిగ్గజ సంస్థ మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.
టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సీఎం రేవంత్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

జపాన్ కంపెనీలతోపాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. దీంతో దాదాపు రూ. 5 వేల కోట్లకుపైగా పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలున్నాయి. కాగా, మరుబెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారిస్తుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్య ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనీకి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జీవనోపాధి మెరుగుపడుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణలో పరిశ్రమలకు అనువైన అవకాశాలున్నాయని.. మారుబెనీకి ప్రభుత్వం తరపున తగినంత మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశంతో జపాన్కు అనేక ఏళ్లుగా స్నేహ సంబంధాలున్నాయన్నారు సీఎం రేవంత్. అందుకే ఇక్కడి పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారన్నారు. తెలంగాణ, హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతను మారుబెని నెక్ట్స్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దైనకాకురా అభినందించారు.
తెలంగాణలో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నామని, అక్కడి అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని సకాకురా పేర్కొన్నారు. మారుబెనీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలలో 410కిపైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, గనులు, లోహాలు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, మొబలిటీ, ఏరోస్పేస్ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 50వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు.












Click it and Unblock the Notifications