కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు జయప్రకాశ్ నారాయణ్ చురకలు
Recommended Video
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ జయప్రకాశ్ నారాయణ తెలంగాణా వ్యతిరేకి అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరో పిచ్చోడు మాట్లాడితే పట్టించుకోవలసిన అవసరం లేదని కేసీఆర్ పరుషంగా మాట్లాడారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై జయప్రకాశ్ నారాయణ్ స్పందించారు. ఎవరైనా , ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాదలేనప్పుడే ఈ విధంగా ఆరోపణలు చేస్తారని జేపీ కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జేపీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు .. స్పందించిన జేపీ
ఎవరో పిచ్చోళ్ళు ఏదేదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ ఇటీవల కాళేశ్వరం పర్యటన సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు . జయప్రకాశ్ నారాయణ తెలంగాణపై ఈర్ష్యతోనే కాళేశ్వరం ప్రాజక్టుపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం ప్రాజక్టు గురించి జయప్రకాశ్ నారాయణకు ఏమీ తెలీదని ఆయన పేర్కొన్నారు. ఏనాడైనా మేడిగడ్డ ప్రాజక్టు వద్దకు వచ్చారా? అసలు ఆయనకు మేడిగడ్డ ఎక్కడ వుందో తెలుసా అని విమర్శలు గుప్పించారు . ఇలాంటి నేతల విమర్శలను తాము పట్టించుకోబోమని తాము చెయ్యాలనుకున్న పని బరాబర్ చేసి తీరతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జయప్రకాశ్ నారాయణ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించారంటూ, తెలంగాణా ఉద్యమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పుడైతే వాదన లోపిస్తుందో అప్పుడే ఎదుటివాళ్లపై ఆరోపణలు చేయడం జరుగుతుందని జేపీ కేసీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి విశ్లేషించారు.

వాస్తవాలు లేనప్పుడు, వాటిలో లాజిక్ లేనప్పుడు ఇలాగే తిడుతుంటారన్న జేపీ
ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన జేపీ ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం, వాస్తవాలు, లాజిక్ తప్ప ఇక తిట్టుకోవటం, ఆరోపణలు చెయ్యటం వంటి మరో విషయం చర్చకు రాకూడదని అభిప్రాయపడ్డారు. ఎదుటి వాళ్లు చెబుతున్నది హేతుబద్ధంగా ఉందా? లేదా? వాళ్లు చెబుతున్నది పాటిస్తే ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా? లేదా? అనేది మాత్రమే ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఇక అసంబద్ధ ఆరోపణలకు ఆస్కారం ఉండకూడదని జేపీ అభిప్రాయపడ్డారు. తన వద్ద వాస్తవాలు లేనప్పుడు, అవి జనాలకు చెప్పలేనప్పుడు, తర్కబద్ధంగా మాట్లాడలేనప్పుడే ఇతరులను తిడుతుంటారని కేసీఆర్ కు సున్నితంగా చురకలంటించారు జయప్రకాశ్ నారాయణ్ . ఇలాంటి సమయాల్లోనే కోపం తెచ్చుకోవడమో, ఉద్వేగాలు రెచ్చగొట్టడమో చేస్తుంటారని అన్నారు. ఇక కేసీఆర్ చేసింది అలాంటిదే అని జేపీ పరోక్షంగా చెప్పారు.

వాదించడానికి ఏమీ దొరకనప్పుడే ప్రజల సెంటిమెంట్ లను రెచ్చగొట్టే యత్నం చేస్తారని కేసీఆర్ కు చురకలు
ఓ మనిషికి వాదించడానికి ఏమీ దొరకనప్పుడే ప్రజల సెంటిమెంట్ లను రెచ్చగొట్టే యత్నం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడే నీ కులం ఇది, నీ మతం ఇది, నీ ప్రాంతం ఇది అనే అంశాలు తెరమీదకు వస్తుంటాయని విమర్శించారు. ఎవరైనా ఎప్పుడైనా కచ్చితమైన నిర్ణయం అయితే , సమంజసమైన పని అయితే చెప్పటానికి సంశయించరని , అలా సంశయిస్తున్నారంటే వారి వద్ద వాస్తవాలు లేవని అర్ధం అని ఆయన అన్నారు . సరైన వాదన ఉంటే దాన్నే వెలిబుచ్చుతారు తప్ప ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేయరని కేసీఆర్ వ్యాఖ్యలపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications