బాబుకు శిక్ష తప్పదు: జీవన్, రేవంత్ బెయిల్ రద్దుకు సుప్రీంకు, కేసీఆర్తో ఖాన్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం నాడు మండిపడ్డారు. జైలు నుంచి విడుదలై ఊరేగింపుగా రావడానికి రేవంత్ స్వాతంత్ర సమరయోధుడా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు జైలు శిక్ష తప్పదన్నారు.
రేవంత్ తీరుతో యావత్ ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందన్నారు. రేవంత్కి హైకోర్టు కేవలం షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చిందన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు టీడీపీ నేతలు రకరకాలదారులు వెతుకుతున్నారన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమన్నారు. ఆంధ్రాలో దోచుకున్న డబ్బును నీ జల్సాలకు ఖర్చు పెట్టారన్నారు. వైసీపీ అధినేత జగన్ ర్యాలీ తీస్తే నీవు ఎద్దేవా చేయలేదా అన్నారు. జనసమీకరణ జరగలేదనే బెయిల్ వచ్చిన రోజు బయటికి రాలేదన్నారు.
ఆయన రేవంత్ రెడ్డి కాదని, రవ్వంత రెడ్డి అని ఎద్దేవా చేశారు. రేపోమాపో మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ మీరా మా గురించి మాట్లాడేదన్నారు. మంత్రులపై ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. పక్క రాష్ర్టానికి సద్దులు మోసే రేవంత్ ఖబడ్దార్ అని హెచ్చరించారు.
కేసీఆర్తో ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్
కేసీఆర్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరిరువురు ఓటుకు నోటు కేసుపై చర్చించారని తెలుస్తోంది. గత నెల రోజులుగా ఈ కేసులో జరిగిన పురోగతి, పరిణామాలను కేసీఆర్కు ఏకే ఖాన్ వివరించారని సమాచారం. అలాగే కేసులో ఎలా ముందుకెళ్లాలో వివరాలు తెలుసుకున్నారు. బెయిల్ పైన విడుదలైన సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలపై చర్చించారని సమాచారం.
సుప్రీంకు ఓటుకు నోటు
బెయిల్ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కాపీలతో పాటు మీసం మెలేస్తూ మాట్లాడిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ వీడియోలను సాక్ష్యంగా చూపించి రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంను కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ తరఫు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. ఇది రేపు విచారణకు రానుంది.
లేఖ తర్వాత ఎవరూ కలవలేదు: సండ్ర
ఓటుకు నోటు కేసులో ఏసీబీకి లేఖ రాసిన తర్వాత తనను ఎవరూ సంప్రదించలేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఉదయం అన్నారు. తాను ఖమ్మంలోనే ఉంటానని, ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని చెప్పారు.