కన్నయ్య రాక, హెచ్సియులో తీవ్ర ఉద్రిక్తత: మెస్ బంద్, నీళ్లు కట్ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం చాలారోజులు ఉద్రిక్తత కనిపించింది. ఆ తర్వాత చల్లబడింది. అయితే, మంగళవారం వీసీ అప్పారావు రాక, బుధవారం కన్నయ్య కుమార్ రాక నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త చోటు చేసుకుంది.
బుధవారం ఉద్రిక్తత నేపథ్యంలో హెచ్సియుకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. వర్సిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నేతలకు సైతం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు అవసరమైన బలగాలను మోహరించాలని వర్సిటీ యాజమాన్యం పోలీసు కమిషనర్కు లేఖ రాసింది. వర్సిటీ మెయిన్ గేటును మాత్రమే తెరిచి, వర్సిటీకి సంబంధించిన వ్యక్తులకే లోపలకు ప్రవేశం కల్పిస్తున్నారు. వర్సిటీలో మెస్ బంద్, నీళ్లు కట్ చేసినట్లుగా తెలుస్తోంది.
అప్పారావు మళ్లీ వర్సిటీలో వీసీగా బాధ్యతలు చేపట్టడం, కన్నయ్య కుమార్ రాక నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కన్నయ్యను వర్సిటీలోకి రానివ్వవద్దని వర్సిటీ నిర్ణయించింది. మరోవైపు, తనకు రక్షణ కావాలని వీసీ పోలీసులను కోరారు.
కన్నయ్య కుమార్ రాక, విహెచ్ను అడ్డుకున్న పోలీసులు
కన్నయ్య కుమార్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు సిపిఐ నేత నారాయణ స్వాగతం పలికారు. మరోవైపు, కాంగ్రెస్ నేత వి హనుమంత రావును పోలీసులు వర్సిటీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా, రోహిత్ తల్లి రాధిక వేముల ఆందోళన చెపట్టారు.
ఇన్ని పరిణామాల మధ్య హెచ్సియులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్పారావుకు మద్దతుగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బంది విధులను బహిష్కరించాయి. అప్పారావు రాకను కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
రోహిత్ చట్టం కోసం పోరాటం: కన్హయ్య
రోహిత్ చట్టం చేసే వరకు పోరాడుతానని హైదరాబాద్ వచ్చిన కన్హయ్య కుమార్ చెప్పారు. సాయంత్రం హెచ్సీయుకు వెళ్తానని చెప్పారు. తాను హెచ్సియుకు వెళ్లి రోహిత్ తల్లి రాధిక మద్దతు తెలుపుతానని చెప్పారు. రోహిత్ తల్లిని కన్నయ్య కుమార్ పరామర్శిస్తారని సిపిఐ నేత నారాయణ చెప్పారు. లా అండ్ ఆర్డర్ దాటకుండా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని చెప్పారు.
హెచ్సియు ఉద్రిక్తం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మరోసారి భగ్గుమంది. రోహిత్ ఆత్మహత్య సందర్భంలో చోటుచేసుకున్న ఆందోళనలు ఈమధ్యే సద్దుమణిగి వాతావరణం చల్లబడింది. వీసీ పొదిలె అప్పారావు మంగళవారం తిరిగి బాధ్యతలు చేపట్టడానికి రావడంతో కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
హెచ్సియు ఉద్రిక్తం
విద్యార్థులు వీసీ గెస్ట్ హౌస్ను ధ్వంసం చేశారు. విద్యార్థుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రతిగా పోలీసులు లాఠీఛార్జి చేసి కొందరు విద్యార్థులను అరెస్టు చేశారు. వర్సిటీ ప్రాంగణం మంగళవారం రణరంగాన్ని తలపించింది.
హెచ్సియు ఉద్రిక్తం
జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నేతృత్వంలో బుధవారం హెచ్సీయూలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.
హెచ్సియు ఉద్రిక్తం
రోహిత్ ఆత్మహత్య తర్వాత విద్యార్థుల ఆందోళనల కారణంగా సెలవుపై వెళ్లిన ఉపకులపతి అప్పారావు మంగళవారం తిరిగి బాధ్యతలు తీసుకునేందుకు వర్సిటీకి రావడంతో తాజా వివాదం నెలకొంది. ఆయన రాకను వ్యతిరేకించిన కొందరు విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.
హెచ్సియు ఉద్రిక్తం
గురువారం జరగబోయే అకడమిక్ కౌన్సిల్ సమావేశంపై డీన్లు, పాలకమండలి సభ్యులతో అప్పారావు అతిథి గృహంలో సమావేశమైనట్లు తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. అదేసమయంలో అప్పారావుకు సంఘీభావం తెలిపేందుకు లైఫ్సైన్స్ విద్యార్థులూ అక్కడికి వచ్చారు.
హెచ్సియు ఉద్రిక్తం
రోహిత్ మృతికి అప్పారావు కారణమని, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే ఇంతవరకు ఆయన్ని అరెస్టు చేయలేదని, విద్యార్థి నాయకుడు ప్రశాంత్ ఆరోపించారు. గెస్ట్ హౌస్ పైన దాడి చేసింది ఏబీవీపీ నేతలేనని, వీసీ తనకు రక్షణగా ఏబీవీపీ వాళ్లను పిలిపించుకున్నారని అప్పారావు రాకను వ్యతిరేకించిన విద్యార్థులు ఆరోపించారు.
హెచ్సియు ఉద్రిక్తం
మరోవైపు, అధికారులను మాత్రమే తాను పిలిపించుకొని సమావేశమయ్యానని, దాడి జరుగుతుందని తెలిసిన తర్వాతే తనపై అభిమానమున్న విద్యార్థులు ఆందోళకారులను అడ్డుకునేందుకు వచ్చారని అప్పారావు తెలిపారు.
కన్నయ్య రాక
నిరసన చేపట్టిన విద్యార్థులు కొందరు అతిథిగృహంలోని వస్తువులను ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, కుర్చీలు, సోఫాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని బెదిరించారు. పాత్రికేయుల పైనా దాడి జరిగింది.
హెచ్సియు ఉద్రిక్తం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. సుమారు 300 మంది ఆందోళనకారులు గెస్ట్ హౌస్ ముందే బైఠాయించారు. సాయంత్రం వరకు వేచి చూసిన పోలీసులు 5 గంటల ప్రాంతంలో వారిని బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు.
హెచ్సియు ఉద్రిక్తం
విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. శ్రీకాంత్ అనే కానిస్టేబుల్తోపాటు మరో ముగ్గురు టిఎస్ఎస్పి సిబ్బందికి గాయాలు కావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ తర్వాత పలువురిని అరెస్టు చేశారు.
హెచ్సియు ఉద్రిక్తం
ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి రాత్రి ఎనిమిది గంటల సమయంలో హెచ్సియుకు వెళ్లారు. క్యాంపస్ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు ఆయనను అడ్డుకోగా ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ తరలించి అనంతరం వదిలేశారు.
హెచ్సియు ఉద్రిక్తం
గెస్ట్ హౌస్ పైన దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై విద్యార్థులు దాడి చేశారని వర్సిటీ బోధనేతర సిబ్బంది ఆరోపించారు. రోహిత్ మృతి అనంతరం విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు తాము మద్దతు పలికామని, ఆ తర్వాత సకాలంలో ఉపకారవేతనాలు అందేలా పని చేశామన్నారు.
హెచ్సియు ఉద్రిక్తం
ఇన్నిరోజులూ జేఏసీకు మద్దతు తెలిపినా తమని దూషించారన్నారు. అందుకు నిరసనగా వర్సిటీ వసతిగృహాలు, మెస్లు, పాలనాపరమైన సేవల్ని నిలిపివేస్తున్నట్లు వర్సిటీ బోధనేతర సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి రిలేదీక్షలకు సిద్ధమవుతున్నట్లు సిబ్బంది ప్రకటించారు.
హెచ్సియు ఉద్రిక్తం
తన పైన వ్యక్తిగత కక్షతో కొందరు విద్యార్థులను ప్రేరేపిస్తున్నారని, నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, రోహిత్ మృతిపై ఇప్పటికే న్యాయ విచారణ జరుగుతోందని, కోర్టులోనూ కేసు నడుస్తోందని, దోషి అని తీర్పు వస్తే తప్పకుండా తప్పుకుంటానని వీసీ అప్పారావు చెప్పారు.
హెచ్సియు ఉద్రిక్తం
నాపై తీవ్ర కోపంతో ఉన్న విద్యార్థులను శాంతింపజేసేందుకే సెలవుపై వెళ్లానని, అంతే తప్ప తప్పు చేశానని కాదన్నారు. వర్సిటీలో 95 శాతంమంది విద్యార్థులు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారని, తన సామర్థ్యంపై వారందరికీ నమ్మకముందని అప్పారావు వివరించారు.