ప్రముఖ హీరోతో నడ్డా భేటీ - ఆ ఫేమస్ స్టార్ కు ఆహ్వానం: బీజేపీ నేతల కొత్త లెక్కలు..!!
బీజేపీ అగ్ర నేతలు తెలుగు సినీ హీరోల పైన ఫోకస్ పెట్టారు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ పైన ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చర్చ సాగుతోంది. అది సినిమా నటనకు అభినందన పూర్వకంగానే కలిశారని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, రాజకీయంగా ఆ సమావేశం అనేక రకాలుగా కీలక చర్చకు కారణమైంది. కొత్త సమీకరణాలు తెలుగు రాష్ట్రాల్లో తెర మీదకు వచ్చాయి. ఇక, ఇప్పుడు వరంగల్ సభలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు మరో ప్రముఖ హీరోతో సమావేశం అవ్వనున్నారు.

నితిన్ తో జేపీ నడ్డా సమావేశం
ఈ మేరకు ఆ హీరోకు ఆహ్వానం అందింది. యువ హీరో నితిన్ ను శంషాబాద్ నోవాటెల్ లో కలిసేందుకు ముహూర్తం నిర్ణయించారు. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ద్వారా ఒక సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగింది. ఇప్పుడు మరో సామాజిక వర్గానికి చెందిన నితిన్ ది తెలంగాణలోని నిజామాబాద్ స్వస్థలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ..రాజకీయంగా కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటికే విజయశాంతి.. జీవిత..జయప్రద బీజేపీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు.

మొన్న తారక్...నేడు నితిన్
కొద్ది రోజుల క్రితం సీనియర్ నటి జయసుధను బీజేపీలోకి పార్టీ నేతలు ఆహ్వానించారు. అదే విధంగా జూనియర్ తో అమిత్ షా సమావేశం జరిగింది. ఇప్పుడు నితిన్ తో నేరుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా భేటీ కానున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ వి అనేక సక్సెస్ సినిమాలు ఉన్నాయి. వరుసగా సినిమా హీరోలకు దగ్గరవ్వటం ద్వారా వారి అభిమానుల ఓట్ బ్యాంక్ పైన బీజేపీ గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతానికే చెందిన హీరో కావటంతో ఈ భేటీ ఆసక్తి కరంగా మారుతోంది. రానున్న రోజుల్లోనూ పలువురు హీరోలతో పాటుగా ప్రముఖులతో..పార్టీ ముఖ్య నేతల భేటీలు కొనసాగతాయని బీజేపీ తెలంగాణ నేతలు చెబుతున్నారు. సినీ రంగంతో పాటుగా ప్రస్తుతం క్రీడా రంగానికి చెందిన ప్రముఖలతో సమావేశాల పైన కసరత్తు జరుగుతోంది.

వారికీ ఆహ్వానం..బీజేపీ కొత్త వ్యూహాలు
అయితే, వారిని పార్టీలోకి ఆహ్వానించటం.. ముందుకు వచ్చిన వారికి స్వాగతం పలికే విధంగా ఈ ప్రయత్నాలు జరుగుతన్నట్లుగా తెలుస్తోంది. జూ ఎన్టీఆర్ టీడీపీతో దూరంగా ఉంటున్నా...బీజేపీలో ఇప్పటికిప్పుడు చేరటం, సమర్ధించే అవకాశాలు లేవు. ఈ సమయంలో రాజకీయాలతో సంబంధాలు లేని నితిన్ ను కలవటం ద్వారా బీజేపీ తెలంగాణలో కొత్త సమీకరణాలు..పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా నడ్డాతో కలవనున్నారు. మరి కొందరు క్రీడా ప్రముఖులు.. రచయితలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇతర రంగాల్లో పేరు సంపాదించిన వారితోనూ భేటీలు ఉంటాయని తెలుస్తోంది.అయితే, బీజేపీలోకి నడ్డా స్వయంగా నితిన్ ను ఆహ్వానిస్తే..యువ హీరో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications