అభిమానులకు, కార్యకర్తలకు శుభవార్త!: రంగంలోకి జూ.ఎన్టీఆర్, మూడ్రోజులు ప్రచారం!!
హైదరాబాద్: నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభవార్త! గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరం పాటించినట్లుగా కనిపించిన ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. జూ.ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు.
ఆ తర్వాత 2012 నుంచి వారసత్వ పోరు కారణంగా టీడీపీకి దూరం పాటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోను ఆయన టీడీపీకి ప్రచారం చేస్తారని తొలుత భావించారు. కానీ ఆయన ప్రచారం చేయలేదు. టీడీపీ ముఖ్యనేతలు కూడా దీనిపై స్పందిస్తూ.. టీడీపీపై అభిమానం ఉన్న వారు ప్రచారం చేస్తారని పరోక్షంగా జూనియర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!
ఆ రోజు చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్
ఆ తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తన మామయ్య చంద్రబాబును కలిశారు. కానీ రాజకీయంగా దూరం పాటిస్తున్నట్లగానే కనిపించింది. ఇప్పుటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గం టిక్కెట్ వచ్చింది. ఇక్కడి నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్నారు.
ప్రచారానికి ఫ్యామిలీ సిద్ధం
సుహాసిని కోసం పలువురు కుటుంబ సభ్యులు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్, తారకరత్న ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు కూకట్పల్లిలో పలు సంఘాలతో భేటీ అయి సుహాసినికి ఓటు వేయమని చెప్పనున్నారని తెలుస్తోంది.
జూ.ఎన్టీఆర్ మరో ఎత్తు
వారంతా ప్రచారం చేయడం ఓ ఎత్తు. జూనియర్ ఎన్టీఆర్ మరో ఎత్తు. ఇప్పుడు జూనియర్ అభిమానులకు, టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారని తెలుస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న సుహాసిని తరఫున ఆమె సోదరుడైన జూ. ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశముందట.
ఈ నెల 27 నుంచి మూడ్రోజులు ప్రచారం
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. కూకట్పల్లి అభ్యర్థిగా సుహాసినిని ప్రకటించగానే ఆమెకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ సోదరి విజయం సాధించాలని కోరుకుంటున్నామని, అదే తన తండ్రి హరికృష్ణకు ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు. తన సోదరి గెలుపు కోసం కృషి చేస్తానని నందమూరి తారకరత్న ఇటీవల చెప్పారు. కార్యకర్తలతో కలిసి కూకట్పల్లి ప్రచారానికి వెళ్తానని తారకరత్న అన్నారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా ప్రచారం చేయనున్నారనే వార్త వచ్చింది. అయితే అధికారికంగా ధ్రవీకరించాల్సి ఉంది.