డ్రగ్స్ కేసులో రూ.7.5 లక్షలకు బెయిల్: జడ్జి, ఇద్దరు లాయర్ల అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకున్నాడన్న ఆరోపణలతో ఒకటో అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్టు చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కూడా అరెస్టు చేశారు.
మొదటి అదనపు సెషన్స్ జడ్జికి, ఇద్దరు న్యాయవాదులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు పదకొండు లక్షల రూపాయలు కావాలని రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారని, చివరకు రూ.7.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై ఓ న్యాయమూర్తి ఫిర్యాదు చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని గాందీ నగర్లోని రాధాకృష్ణమూర్తి నివాసంలో ఏసీబీ సోదాలు చేసి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
లంచానికి బెయిల్?: మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్పై కేసు, ఏసీబీ సోదాలు
అంతకుముందు, ఇది తమ దృష్టికి రావడంతో హైకోర్టు స్పందించింది. లంచం తీసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో కేసు నమోదు చేయాలని తమను ఆదేశించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయడంతో పాటు సికింద్రాబాద్లో మెజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తి ఇంటిలో సోదాలు నిర్వహించారు.
డ్రగ్స్ కేసులో గాంధీనగర్లో పట్టుబడిన నైజీరియన్లకు బెయిల్ మంజూరు చేసేందుకు మెజిస్ట్రేట్ వారితో రూ.7.50లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని బెయిల్ మంజూరు చేశారని డీజీ పూర్ణచంద్రరావు తెలిపారు.