Justice for Disha: గల్ఫ్ మాదిరిగా కఠిన చట్టాలు కావాలి.. బలంగా వినిపిస్తున్న డిమాండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటన పై ఇప్పుడు దేశం మొత్తం ఆలోచనలో పడింది. ఇలాంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టాలంటే ఎలా అని అందరూ ఆలోచిస్తున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ గల్ఫ్ దేశాల్లోలా మనదేశంలోనూ కఠినమైన చట్టాలు అమలు చేయాలని. ఇప్పుడు ఎక్కడ ఈ నలుగురు కలిసినా ఇదే చర్చించుకోవడం ప్రధానంగా కనిపిస్తోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ, అమానవీయంగా ప్రవర్తిస్తున్న నరరూప రాక్షసులను, అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద నరికేయాలి అన్న డిమాండ్ వినిపిస్తుంది.

ప్రవాస భారతీయులను సైతం ఆవేదనకు గురి చేసిన ఘటన
ఒక్క మన దేశంలోనే కాదు ఈ ఘటన విదేశాల్లో ఉన్న భారతీయులను సైతం కలచివేస్తోంది. శంషాబాద్ పరిధిలో జరిగిన దారుణ సామూహిక ఆత్యాచారం, హత్య ఘటన విదేశాల్లో ఉన్న భారతీయులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. మహిళలపై అత్యాచారాల విషయంలో గల్ఫ్ తరహాలో కఠిన చట్టాలు తేవాలని ప్రధానంగా దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో ఉన్న వారి నుండి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ప్రవాసులు సైతం భారతదేశంలోని మహిళల భద్రత విషయంలో టెన్షన్ పడుతున్నారు.

గల్ఫ్ దేశాల్లోలా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్
మహిళలను గౌరవించే సంస్కృతిని పెంపొందించాలని తరుణంలో ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా మెజారిటీ ప్రజల నుండి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరస్తులను చాలా కఠినంగా శిక్షించాలని, ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఉన్న శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ప్రవాస భారతీయులు భారతదేశానికి రావాలంటే భయంగా ఉందని, గల్ఫ్ దేశాలలో మహిళలకు భద్రత ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారిని నడిరోడ్డు మీదే చంపెయ్యాలి ... అందరి డిమాండ్ ఇదే
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ముక్తకంఠంతో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పరిష్కారం ఉండాలని, నేరస్తులకు వెంటనే కఠిన శిక్షలు పడాలని కోరుతున్నారు. ఇక షాద్ నగర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో దోషులను నడిరోడ్డు మీద ఉరితీయాలని, వారిని కూడా వెటర్నరీ వైద్యురాలిని దహనం చేసిన విధంగా దహనం చేయాలని, నడిరోడ్డు మీద నరికి చంపాలని ప్రజల నుండి రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి.

చట్టాల సవరణ అవసరం అని దేశ వ్యాప్త చర్చ
భారతదేశంలో చట్టాల్లో ఉన్న లొసుగులు వల్లే నేరస్తులకు శిక్షలు పడడం లేదని దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఒకవేళ శిక్షపడిన తిరిగి వాళ్ళ రివ్యూ వెళ్లకుండా ఉండేలా చట్టాలు లేవని చర్చిస్తున్న వేళ మహిళల భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని కోరుతున్నారు దేశ ప్రజలు. నిన్నటికి నిన్న నగరి ఎమ్మెల్యే రోజా సౌదీ తరహాలో శిక్షలు అమలు చేయాలని, అమ్మాయిపై చెయ్యాలంటే భయపడాలి అని పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నీచులను నడిరోడ్డు మీద ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

గల్ఫ్ తరహాలో నడిరోడ్డు మీద నరికి చంపితే నేరస్తులకు కాస్తైనా భయం కలుగుతుందన్న భావన
ఇలా రాజకీయ నాయకుల దగ్గర నుండి, సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు వారిని చంపేయాలని డిమాండ్ చేస్తున్న వేళ అందుకు తగినట్టుగా మనదేశంలోని చట్టాలను మార్చాలని పలువురు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. గతంలో నిర్భయ ఘటన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్ష అమలు కాకపోవడంపై కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండడానికి గల్ఫ్ దేశాల్లో లాగా చట్టాలు మారాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి ప్రధానంగా వినిపిస్తున్న ఈ డిమాండ్ పరిశీలిస్తారా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications