తెలంగాణ హైకోర్టు ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇంఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ హిమా కోహ్లీ రిలీవ్ కాగానే జస్టిస్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాలని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. కాగా, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎం జగన్నాథరావు కుమారుడే జస్టిస్ రామచంద్రరావు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు 1966లో హైదరాబాద్లో జన్మించారు.

ఉస్మానియా వర్సిటీలో 1989లో ఎల్ఎల్బీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యాను అభ్యసించారు. 1989 సెప్టెంబర్ 7న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన ఐఆర్డీఏ, ఎస్బీఐ, ఎస్బీహెచ్, డీసీసీబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఐపీఈ, సెబి, సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులైన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు.. 2013, డిసెంబర్ 4 నుంచి న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
కాగా, సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై గురువారం రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారు. కొత్త న్యాయమూర్తులుగా వీరందరూ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది. ఒక్క ఖాళీ మాత్రమే మిగులుతుంది. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తొమ్మిది మందితో కూడిన కొత్త న్యాయమూర్తుల జాబితాను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సిఫార్సులను పరిశీలించిన న్యాయశాఖ వాటిని ప్రధాని కార్యాలయానికి పంపింది. ఆగస్టు 17న చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఆ జాబితా అక్కడ్నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లగా.. కొలీజియం సిఫార్సులకు ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకంపై నాయశాఖ త్వరలోనే అధికారిక నోటిఫకేషన్ విడుదల చేయనుంది.
Recommended Video
కొత్త న్యాయమూర్తుల్లో కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ విక్రమ్నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు జడ్జి బేలా త్రివేది, బార్ నుంచి న్యాయవాది పీఎస్ నరసింహలను కొలిజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. కాగా, 31న జడ్జీలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications