బీజేపీలో చేరిక రోజే అవమానం జరిగింది కదా!! .. ఈటెల రాజేందర్ కు కడియం శ్రీహరి సూటి ప్రశ్నలు
ఈటెల రాజేందర్ కు బీజేపీలో చేరిన మొదటి రోజు అవమానం జరిగిందా? ఈటెల రాజేందర్ కు బిజెపిలో సరైన ప్రాధాన్యత దక్కే అవకాశం లేదా? బీజేపీలో చేరి ఈటెల తప్పులో కాలేశాడా ? అంటే అవును అని చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇంతకీ కడియం శ్రీహరి ఈటెల రాజేందర్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత? ఆయన ఈటెలకు సంధించిన ప్రశ్నలు ఏంటి ? అంటే
ఈటెల టార్గెట్ గా కోవర్ట్ ఆపరేషన్ ? హుజూరాబాద్ లో షాక్ ఇచ్చేలా సీఎం కేసీఆర్ అపర చాణిక్యం !!
బిజెపిలో చేరిన రోజు ఈటెల రాజేందర్ కు పరాభవం
బిజెపిలో చేరిన రోజు ఈటెల రాజేందర్ కు పరాభవం ఎదురైంది అని కడియం శ్రీహరి ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకు కారణం ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరకుండా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈటెల రాజేందర్ కు ముఖ్య నాయకుడిగా స్థానం కల్పిస్తే, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే పార్టీలో చేర్చుకునే వారంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇది ఈటెల రాజేందర్ కు జరిగిన అవమానంగా పేర్కొన్నారు.
బీజేపీతో ఎలా కలుస్తారని నిలదీత
ఇదే సమయంలో ఈటెల రాజేందర్ ఎవరిని ఉద్ధరించడం కోసం ఆ పార్టీలో చేరారు సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ భావాలకు, బిజెపి సిద్ధాంతాలకు ఏ విధమైన పొంతన ఉండదని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఈటెల రాజేందర్ సోషలిస్టు భావాలు కలిగిన వ్యక్తి అని, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీతో ఎలా కలుస్తారని కడియం శ్రీహరి నిలదీశారు. ఈటెల రాజేందర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పార్టీలో చేరారని ఆయనకు కమ్యూనిస్టు భావజాలం పోయిందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
సోషలిస్టు భావాలతో మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు
ఆయన ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని మండిపడిన కడియం శ్రీహరి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులపై ఉన్న కేసులను ఆసరాగా చేసుకుని కుంటి సాకులను చూపించి బీజేపీ ఇతర పార్టీల నాయకులను లొంగదీసుకుంది అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడంతో సోషలిస్టు భావాలతో మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు అంటూ నిప్పులు చెరిగారు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీపై ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఆత్మ గౌరవం గురించి మాట్లాడే ఈటెల ఇంకా ఆ పని ఎందుకు చెయ్యలేదు
ఆత్మ గౌరవం గురించి మాట్లాడే ఈటెల ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి ఇంకా అప్పజెప్పలేదు అంటూ ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ పై అవినీతి ఆరోపణల కారణంగ నే ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేశారని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. 26 లక్షల రూపాయలు రైతుబంధు కింద ఈటెల రాజేందర్ తీసుకున్నారని, రైతు బంధు ని వ్యతిరేకిస్తున్న ఈటల రాజేందర్ ఎలా ఆ డబ్బులు తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు కడియం శ్రీహరి.
కేసుల నుండి తప్పించుకోవడానికి బీజేపీలో చేరిక
ఈటెల రాజేందర్ కు ప్రజాస్వామ్య విలువలు లేవని మండిపడ్డారు.కేసుల నుండి తప్పించుకోవడానికి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారని, ఆయన ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కడియం శ్రీహరి. పేద ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, విభజన అంశాల పైన కూడా మొండివైఖరి ప్రదర్శిస్తోందని అలాంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఈటెల చేరటం దేనికోసం అని కడియం శ్రీహరి మండిపడ్డారు