‘అభివృద్ధికి కేంద్రంగా ఓరుగల్లు: ఔత్సాహికులకు ప్రోత్సాహం ’
అభివృద్ధికి కేంద్రంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
వరంగల్: అభివృద్ధికి కేంద్రంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మడికొండ పారిశ్రామికవాడ (ఎస్ఈజడ్)లోని ఇంకుబేషన్ టవర్లో ఏర్పాటుచేసిన సైయంట్ కంపెనీని ఆదివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం సైయంట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్కుమార్ మక్కె అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ కంపెనీలను జిల్లా కేంద్రాలకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మడికొండలోని 45 ఎకరాల ఎస్ఈజడ్లో కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులను కల్పించామన్నారు.

రూ.3 కోట్లతో రోడ్ల అభివృద్ధి, రూ.కోటితో విద్యుద్దీకరణ, ఆధునిక విద్యుద్దీపాలు ఏర్పాటుచేశామన్నారు. ఇంకుబేషన్ టవర్లో మూడు కంపెనీలు ప్రస్తుతం నడుస్తున్నాయని వీటిలో సైయంట్ కంపెనీ ప్రముఖమైందని గుర్తుచేశారు. వరంగల్ కేంద్రంగా పనిచేసేందుకు వీలుగా ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ మానుఫ్యాక్చరింగ్, టెలి కమ్యూనికేషన్స్ సేవలను విశ్వవ్యాప్తంగా అందించే విధంగా వరంగల్ సైయంట్ కంపెనీ 100 మంది ఉద్యోగులతో పనిచేస్తుందని వివరించారు.
టీఎస్ఐఐసీ ఎస్ఈజడ్ కేటాయించిన ఐదెకరాల స్థలంలో శాశ్వత భవనం నిర్మించిన అనంతరం రెండేళ్లలో వెయ్యి మందికి ఉపాధి కల్పించేలా కంపెనీ సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. స్థానికులకే ప్రాధాన్యతనిస్తూ 70 శాతం ఉద్యోగాలు జిల్లా యువతకు కేటాయించారని చెప్పారు. ఇంకుబేషన్ టవర్ రెండో దశ పనులను రూ.6 కోట్లతో తర్వలోనే చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఏర్పాటు..
సైయంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండడంతో పాటు ఐటీ కంపెనీలకి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి ప్రోత్సహించడంతో ఓరుగల్లులో కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శాసనసభ్యుడు అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా, ఇండస్ట్రీయల్ కారిడార్గా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరాన్ని తీరిదిద్దుతున్నారని చెప్పారు. దీనిలో భాగమే ఐటీ కంపెనీలు నగరానికి వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, విప్ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్పర్సన్ పద్మ, మేయర్ నన్నపనేని నరేందర్, పోలీసు కమిషనర్ సుధీర్బాబు, కార్పొరేటర్ జోరిక రమేశ్, సైయంట్ కంపెనీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications