చావుకు కూడా భయపడని లక్షణం కాళోజీది: కడియం
హైదరాబాద్: చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా ఉండేదని కొనియాడారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు.
హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కాళోజి 101వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రలు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, ఇతర నాయకులు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, తదితరులు పాల్గొన్నారు. కాళోజి పురస్కారాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు చెందిన వేణుగోపాల్రావుకు ప్రదానం చేశారు.
కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకునే అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపాలని కడియం శ్రీహరి అన్నారు. ప్రజా సమస్యలపై కడదాకా పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ అని గుర్తు చేశారు. ఎవరికీ భయపడని మనస్తత్వం కాళోజీది అని తెలిపారు. ప్రజల సమస్యలను నా గొడవ అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. వరంగల్లో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు.

కాళోజీ గొప్ప వ్యక్తి అని, ఆయన విప్లవాలకు నిలయమని హోం మంత్రి నాయని నర్సిహా రెడ్డి అన్నారు. విప్లవ ఉద్యమంలో కాళోజీ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కాళోజీ రచనలు ప్రజలను చైతన్య పరిచాయని తెలిపారు. కాళోజీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
తెలంగాణ ఆకాంక్షను, స్ఫూర్తిని రగిలించిన మహానీయుడు కాళోజీ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. కాళోజీ మహోన్నతమైన వ్యక్తి అని చెప్పారు. కాళోజీ జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమన్నారు. కాళోజీ ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాళోజీ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications