'ఐఏఎస్ కావాల్సినోన్ని ఆత్మహత్య చేసుకుంటున్నా.. విద్యార్థుల్లారా కేసీఆర్ను విడిచిపెట్టకండి...'
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బోడ సునీల్ అనే విద్యార్థి శుక్రవారం(మార్చి 26) ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు సునీల్ తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటానని... విద్యార్థుల్లారా ముఖ్యమంత్రి కేసీఆర్ను విడిచిపెట్టవద్దని ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం.
'నేనేమీ చేతగాక చనిపోవట్లేదు. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతుంది. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలన్న కారణంతోనే నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని.. ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాను. విద్యార్థుల్లారా కేసీఆర్ను విడిచిపెట్టకండి.' అని సెల్ఫీ వీడియోలో బోడ సునీల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

బోడ సునీల్ స్వగ్రామం గూడురు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ రామ్సింగ్ తండాగా కేయూ విద్యార్థులు చెబుతున్నారు. సునీల్ 2016లో ఎస్సై నియామక పరీక్ష రాసి అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఎత్తు తక్కువగా ఉండటంతో సునీల్కు ఉద్యోగం రాలేదని తెలుస్తోంది. అప్పటినుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సునీల్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం కేయూలో ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications