చరిత్రలో నిలిచిపోయేలా కాకతీయవైభవ సప్తాహం: ఏర్పాట్లకు 50లక్షల నిధులు: మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ : చరిత్రలో నిలిచిపోయేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈనెల ఏడవ తేదీ నుండి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం సంబరాలకు సన్నాహక సమావేశాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ కాకతీయ వైభవ సప్తాహం సన్నాహాలకు 50 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి సత్యవతి రాథోడ్
కాకతీయుల చరిత్ర ప్రతిబింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సన్నాహక సమావేశంలోగిరిజనశాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని కాకతీయుల ఉత్సవాలను భావి తరాలు తెలుసుకునేలా ఘనంగా నిర్వహించాలని అన్నారు. కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా, కాకతీయుల చరిత్ర, కాకతీయ సామ్రాజ్య విస్తరణ విశేషాలు ప్రజలకుతెలిసేలా ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన చేసే విదంగా కృషి చేయాలన్నారు.
కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా కార్యక్రమాలను రూపొందించాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్ధేశాలతో ప్రజాప్రతినిధుల సమన్వయంతో చరిత్రలో నిలిచిపోయేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కాకతీయులు ప్రజల కొరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని, అవన్నీ తెలుసుకొని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు .కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా కార్యక్రమాల రూపొందించాలన్నారు.
పండగ వాతావరణంలో వారం రోజుల పాటు సంబరాలు
కాకతీయ చరిత్ర పై అవగాహన ఉన్న వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఎన్జీవోల సహకారం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహణపై విస్తృత ప్రచారం కల్పించాలని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. కూడా, మున్సిపల్ శాఖల నుండి అవసరమైన పనులు ఆయా శాఖల పరిధిలోచేపడతామన్నారు.
పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని ఇందుకు అన్ని శాఖలుసమన్వయం తో పని చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఈ ఉత్సవాలలో కాకతీయుల శాసనాలు, చిహ్నాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఏడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో కవులను, కళాకారులను భాగస్వామ్యం చెయ్యాలని సూచించారు.
తెలంగాణా గొప్పతనం తెలిసేలా కాకతీయ వైభవ సప్తాహం : దాస్యం వినయ్ భాస్కర్
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ పర్యాటక , సాంస్కృతిక , కార్పొరేషన్ తదితర అన్ని శాఖలు సమన్వయం తో కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. టార్చ్ స్వచ్చంద సంస్థ ఇతర చరిత్ర పరిశోధకుల స్పూర్తితో ఈ కార్యక్రమం నిర్వహణ తలపెట్టామని, ఇందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. కాకతీయుల వైభవాన్ని తెలియజేసేలా, తెలంగాణ జాతి ఔనాత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.