సైకోసిస్తో బాధపడుతోంది: మోడీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన కవిత
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం పాలసీ సైకోసిస్తో బాధ పడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
గురువారం లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న కవిత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను మంచి, చెడు, వికారం అనే మూడు దశల్లో విశ్లేషించారు. ఎన్డిఏ ప్రభుత్వానికి నినాదాలు ఇవ్వడం తప్ప నిర్ణయాలు తీసుకోవటం రాదని దుయ్యబట్టారు. బడ్జెట్ నిండా అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు.
గందరగోళ విధానాల మూలంగా గట్టి నిర్ణయాలను తీసుకోలేకపోయిందన్నారు. తాను ఆశావాదిని కాబట్టి మొదట బడ్జెట్లోని మంచి గురించి మాట్లాడుతానంటూ ప్రణాళిక, ప్రణాలికేతర విభజనను తొలగించటాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. ఈ మార్పును అమలు చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని ఆమె హితవు పలికారు.
నరేగా పథకానికి 38 వేల కోట్లు కేటాయించటం అద్భుతమని, పిఎంజిఎస్వై, మధ్యాహ్నం భోజన పథకం కేటాయిపులను పెంచటాన్ని సరైన నిర్ణయాలేనని అన్నారు. ముద్రా బ్యాంకు కేటాయింపులు, ఈపిఎఫ్లో పడి ఉన్న తొమ్మిది వేల కోట్లతో సీనియర్ సిటిజన్ నిధిని ఏర్పాటు చేయడం వంటివి ప్రశంసనీయమన్నారు. తెలంగాణలోని వెనకుబడిన జిల్లాల అభివృద్ధికి 450 కోట్లు ఇవ్వటాన్ని ప్రస్తావించిన కవిత ముందు,ముందు వీటిని మరింత పెంచాలన్నారు.
బడ్జెట్లోని చెడును ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలు గందరగోళంగా ఉన్నాయని కవిత విమర్శించారు. అంకెల గారడీ చేశారని, మెగా నగరాల్లో సౌకర్యాలు పెంచటంపై దృష్టి కేటాయించకపోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రజలకిచ్చిన హామీల వల్లే బిజెపికి ఓట్లు పడ్డాయని, చారిత్రక విజయం లభించిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రెండేళ్లు, మూడు బడ్జెట్ల తరువాత మీరు జగ్లరీ, నారేబాజీ,పబ్లిసిటీ, హైపర్ నేషనాలిటీ, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని తప్పు పట్టారు. గత ప్రభుత్వం పాలసీ పరాలసిస్తో బాధ పడితే ఎన్.డి.ఏ ప్రభుత్వం పాలసీ సైకోసిస్తో బాధ పడుతోందని ఆమె విమర్శించారు.
పాలసీ సైకోసిస్ అంటే మన విధానం ఒకటి అయితే చేసేది మరొకటి అని ఆమె వివరించారు. సహకార ఫెడరలిజం అని మీరు చెబుతారు కానీ తెలంగాణాకు ఏమిచ్చారు. ఎఫ్.ఆర్.బి.ఎంను సగం శాతం పెంచాలని తెలంగాణా ప్రభుత్వం కోరుతుంటే రెండేళ్ల నుంచి నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడా అంశాన్ని ఒక కమిటీకి అప్పగించటం పాలసీ సైకోసిస్ కాదా? అని కవిత ప్రశ్నించారు.
అంకుల పరిశ్రమలు, డిజిటల్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా పథకాల గురించి మాట్లాడుతారు కానీ ఇంటర్నెట్ ప్రచారంపై పన్ను విధించటం పాలసీ సైకోసిస్ కాదా? అని ఆమె నిలదీశారు. దేశంలోని అటో ఉత్పాదక రంగం బాగా పని చేస్తుంటే దానిపై పన్ను విధించారని కవిత విమర్శించారు. రూపాయి మారకం రేటును పరిరక్షించటంలో విఫలమయ్యారు.
ఒక ర్యాంకు ఒక పింఛన్ విధానాన్ని 7వ వేతన సంఘంతో ముడివేయటం మంచిది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సైనిక రంగానికి సంబంధించిన అంశాల్లో మెదడుతో కాకుండా హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి ఎనబై ఏడు వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఇచ్చారన్నారు కానీ ఆర్థిక శాఖలోని పదిహేను వేల వ్యవసాయ రాయితీని తెచ్చి దీనిలో కలిపి ఏదో చేశామంటున్నారు, ఇది మంచి పద్దతి కాదని ఆమె స్పష్టం చేశారు.
డబ్బులు ఒక జేబులో నుండి తీసి మరో జేబులో పెట్టినంత మాత్రాన కేటాయించినట్లు కాదని కవిత సూచించారు. రైతులను తప్పుదోవ పట్టించారని అన్నారు. వ్యవసాయ రంగం ఒకటి కంటే తక్కువ శాతం వృద్ది ఉంటే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు ఎలా చేస్తారని ఆమె నిలదీశారు. మీరు ఇలాగే వ్యవహరిస్తే తదుపరి ఎన్నికల్లో ఇంటికి పోవటం ఖాయమని ఆమె చెప్పారు.