మాకూ పోలవరం లాంటి ప్రాజెక్ట్: బీజేపీపై కవిత ఆశ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు ఇచ్చినట్లుగానే, తెలంగాణకు కూడా అలాంటి ప్రాజెక్టు ఇస్తారని తాము భావిస్తున్నామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం అన్నారు. కేంద్రమంత్రి ఉమాభారతితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల పంపిణీ అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. పోలవరం వంటి ప్రాజెక్టు తెలంగాణకూ ఇస్తారని భావిస్తున్నామని చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్ అంశం పైన కేంద్రమంత్రి ఉమాభారతితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారని చెప్పారు. మే 16వ తేదీలోగా ఉమాభారతి ఏపీకి వస్తారని చెప్పారు.
మరోవైపు, కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ కే కేశవరావు విలేకరులతో మాట్లాడారు. 15 రోజుల్లోగా హైకోర్టును విభజించాలని కేంద్రమంత్రిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
ఉమ్మడి ఉన్నత న్యాయస్థానంపై తమకు విశ్వాసం పోయిందని చెప్పారు. తెలంగాణ కేసుల విచారణను వేరే హైకోర్టులకు బదలాయించాలని కోరామన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 31,32లో ప్రత్యేక న్యాయస్థానం అంశం ఉందన్నారు.
రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమాలోచన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.