కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్
ఉత్తరాదిలో బాలికలు, యువతులపై చోటుచేసుకున్న హత్యాచారాలపై దేశమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కూతుళ్లను కాపాడుకోవాల్సిన తల్లే.. వారిని బలవంతంగా యువకుల దగ్గరకు పంపి అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి తిరిగిరావడంతో కీచక తల్లి బాగోతం బయటపడింది. బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండటం అందరినీ షాక్ కు గురిచేసింది.

పెద్ద కూతురిని బలవంతంగా..
కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో స్థానికంగా నివసిస్తోంది. ఆమె భర్త పొట్టకూటికోసం విదేశాల్లో పనికి వెళ్లాడు. కూతుళ్లను కాపాడుకోవాల్సిన ఆ తల్లి అడ్డదారులు తొక్కింది. స్వయంగా బిడ్డల జీవితాలను జీవితాలను నాశనం చేసింది. తనకు పరిచయం ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్, మరో యువకుడి దగ్గరికి పెద్ద కూతురిని పంపి, బలవంతంగా ఆ పని చేయించేది. కొంత కాలానికి ఆ నరకాన్ని భరించలేక పెద్దమ్మాయి ఎలాగో వారి బారి నుంచి తప్పించుకుంది. కానీ..

మైనర్ బాలికపై కన్ను..
తాము బలవంతంగా అనుభవిస్తోన్న పెద్దమ్మాయి పారిపోవడంతో కీచకులు కన్ను మైనర్ అయిన చిన్నకూతురుపై పడింది. అభం శుభం తెలియని చిన్నకూతురినీ యువకుల కామానికి బలిపెట్టిందా కన్నతల్లి. చిన్నకూతురిని వారి వద్దకు తరచూ పంపడం మొదలుపెట్టింది. ఆ మృగాళ్ల చేతిలో చిన్నారి జీవితం కూడా నాశనమైంది. ఈ కీచకపర్వం అలా కొనసాగుతున్న తరుణంలోనే విదేశాలకు వెళ్లిన తండ్రి తిరిగిరావడంతో కూతుళ్లు తమ బాధ చెప్పుకుని విలపించారు. దీంతో..

కామారెడ్డి ఎస్పీకి మొర..
చిన్న కూతురు చెప్పిన దారుణాలు విని చలించిపోయిన ఆ తండ్రి.. పెద్ద కూతురి జాడ కూడా కనిపెట్టి, వాళ్లను వెంటబెట్టుకుని నేరుగా కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి దగ్గరికి వెళ్లారు. కన్న తల్లే తమ జీవితాలను ఎలా నాశనం చేసిందో వివరించిన బాలికలు.. తమను కాపాడాలంటూ ఎస్పీకి మొరపెట్టుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా పరిగణించిన ఎస్పీ శ్వేత.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ పోలీసులను ఆదేశించారు. పెద్దమ్మాయి, మైరర్ అయిన చిన్నమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అతను మెదక్ జిల్లాలో పనిచేస్తుండగా, ఉన్నతాధికారులు సమాచారం అందించి, అతణ్ని అరెస్టు చేశారు. పిల్లలను తార్చిన తల్లితో పాటు నిందితులైన కానిస్టేబుల్, మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఎస్పీ శ్వేతారెడ్డి భరోసా..
పైశాచిక కన్నతల్లి ఉదంతం మరువక ముందే, కామారెడ్డి జిల్లాలో.. పదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడో దుండగుడు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల ఘటనల్లో బాధితులకు అండగా ఉంటానని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్వేతారెడ్డి భరోసా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications