దానికి సిద్దమా?, పేరు మారుస్తా..: ఐలయ్య; అరెస్ట్ చేయాలని ఆర్యవైశ్య డిమాండ్..
తన డిమాండ్లకు ఒప్పుకుంటే పుస్తకం పేరు మార్చడానికి తాను సిద్దంగా ఉన్నానని ఐలయ్య ప్రకటించారు.
Recommended Video
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకం మీద రగడ కొనసాగుతూనే ఉంది. 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆర్యవైశ్య వర్గాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
మరోవైపు తన డిమాండ్లకు ఒప్పుకుంటే పుస్తకం పేరు మార్చడానికి తాను సిద్దంగా ఉన్నానని ఐలయ్య ప్రకటించారు. వాటికి అంగీకరిస్తే.. పుస్తకం పేరును 'సామాజిక సర్వర్లు వైశ్యులు'గా మారుస్తానని అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై భగ్గుమన్న వైశ్యులు: ఎవరినీ విమర్శించలేదన్న ఐలయ్య..
ఇదీ డిమాండ్:
తెలుగు రాష్ట్రాల్లో టీజీ వెంకటేశ్, జీఎంఆర్, లలిత జువెలర్స్ లతో పాటు ఆదానీ, అంబాని, కిర్లోస్కర్, గోయెంకా తదితర పారిశ్రామికవేత్తలంతా వైశ్యులేనని ఐలయ్య అన్నారు. దేశ ఆస్తిలో 46శాతం వైశ్య కమ్యూనిటీ చేతుల్లోనే ఉందన్నారు.
ఈ సామాజికవర్గం బీజేపీకి ఇస్తున్న డొనేషన్లలో 5శాతం సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేసి.. దళిత, ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని ఐలయ్య అన్నారు. ఆర్యవైశ్య బడా కంపెనీల్లో 5శాతం ఉద్యోగాలు ఆదివాసీలు, దళితులు, చాకలి, మంగళి వంటి కులాల వారికి ఇస్తే తన పుస్తకాన్ని తానే ఉపసంహరించుకుంటానని అన్నారు.
అకాల మరణం వస్తే.. వారే కారకులు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి తనకెలాంటి హాని జరగదని, కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గంతోనే తనకు ప్రాణహాని ఉందని ఐలయ్య అన్నారు. తననో దేశద్రోహిగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపినా, అకాల మరణం వచ్చినా దానికి ఆర్యవైశ్యులే కారణమన్నారు. ఆర్య వైశ్య సత్రాల్లోకి అందరినీ అనుమతించాలని, లేకుంటే ప్రతీ కులానికి సత్రం కట్టించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఆర్యవైశ్య ముఖ్యప్రతినిధులు చర్చించి ఒక ప్రతిపాదన చేయాలని అప్పుడే తాను వారి సామాజిక సేవలపై పుస్తకం రాస్తానని ప్రకటించారు. తాను రాసిన పుస్తకాన్ని నిషేధించాలని, శీర్షిక మార్చాలని ఆర్యవైశ్య సంఘాలు తన దిష్టిబొమ్మలు దహనం చేయడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం సరి కాదన్నారు.
ఐలయ్యతో విబేధించిన మందకృష్ణ:
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అన్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాఖ్యలను మంద కృష్ణమాదిగ ఖండించారు. కులంలో ఒకరు తప్పు చేస్తే కులాన్ని మొత్తం దూషించడం, అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆనాడు తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు వదిలారని, ఆయన ఆర్యవైశ్యుడు కాదా? అని ప్రశ్నించారు.
ఇక ఎస్సీ వర్గీకరణ గురించి ప్రస్తావిస్తూ.. మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబరు 7న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సరికాదన్న బూర నర్సయ్య గౌడ్:
కంచ ఐలయ్యకు తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇతర సామాజిక వర్గాలవారు మనస్తాపం చెందేలా వ్యవహరించడం సరికాదన్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఏ కులంలో అయినా లోటుపాట్లు సహజంగా ఉంటాయని, అంతమాత్రాన ఆ కులం మొత్తాన్ని దూషించడం సరికాదన్నారు. కుల, మతాలకు అతీతంగా ముందుకుసాగితేనే అన్ని రంగాల్లోను పురోగతి సాధ్యమవుతుందన్నారు.
ట్యాంక్ బండ్పై నిరసన:
తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ డిమాండ్చేశారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ట్యాంక్బండ్పై వందలాది మంది ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం లోయర్ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. దీంతో ఉప్పల శ్రీనివాస్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్పేట పీఎస్ కు తరలించారు.
ఇక ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాచలం బంద్కు ఆర్యవైశ్యులు పిలుపు నిచ్చారు. ఐలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ కరీంనగర్ జిల్లా అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు పోలీసులకు శనివారం చేరే అవకాశం ఉంది.