గ్రేటర్లో రివర్స్: టీడీపీలో చేరిన శ్రీనివాస్ (ఫోటో)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొంతలో కొంత ఊరట! మాజీ కార్పోరేటర్ కంజర్ల శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లేక్ వ్యూ అతిథి గృహంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సెటిలర్లపై అభిమానం ప్రదర్శించడం శోచనీయమని నగర టీడీపీ అధ్యక్షులు సీ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆంధ్రోళ్లు వెంటనే వెళ్లిపోవాలని కేసీఆర్ రోజుకో ప్రకటనతో వారిని భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఇబ్బందుల పాలుచేసి నేడు కపటప్రేమను ప్రదర్శించడం దారుణమన్నారు.

గతంలో చేసిన ప్రకటనల విషయంలో వారికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. సెటిలర్ల తరుఫున భరోసా ఇచ్చింది టీడీపీ మాత్రమే అన్నారు. ఓట్లు, సీట్లు, ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం కేసీఆర్ నేడు సెటిలర్లపై ప్రేమను ప్రదర్శిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన నగర ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
గ్రేటర్లో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు జరిగింది శూన్యమన్నారు. ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వేసవికాలం సమీపిస్తున్నప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications