బావిలో పడిన కారు: రిటైర్డ్ ఎస్ఐ పాపయ్యనాయక్ మృతదేహం వెలికితీత
కరీంనగర్: జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు దగ్గర గురువారం ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును అధికారులు, పోలీసులు గంటలపాటు శ్రమించి బయటికి తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం రెస్క్యూటీంకు కష్టంగా మారింది.
దాదాపు 8 గంటలపాటు శ్రమించిన అధికారులు గురువారం సాయంత్రం తర్వాత క్రేన్ సాయంతో కారును బయటుకు తీశారు. కారు అద్దాలు తెరిచి చూడగా.. అందులో ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడు రిటైర్డ్ అగ్నిమాపక అధికారి పాపయ్య నాయక్గా గుర్తించారు. భీమదేవరపల్లి మండలం సూర్యానాయక్ తండా ఆయన స్వస్థలం.
పాపయ్య నాయక్ హుస్నాబాద్ అక్కన్నపేటలో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించి, ఇటీవలే పదవీ విరమణ పొందారు. కరీంనగర్ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఐదు మంది వరకు ఉన్నట్లు మొదట భావించినా.. కారు బయటకు తీసిన తర్వాత ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాపయ్యనాయక్ తమ్ముడు.. మృతుడిని గుర్తుపట్టారు.
జీడిమెట్ల ప్రమాదంలో క్షతగాత్రుడు మృతి
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-2లోని నాసెన్స్ ల్యాబ్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉద్యోగి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో షిఫ్ట్ ఇంఛార్జ్ హరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ హరిప్రసాద్ గురువారం మృతి చెందాడు. రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.