చంద్రబాబు సమక్షంలో టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్, భారీ ర్యాలీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
అంతకుముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంటన ర్యాలీగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కి నివాళులర్పించి.. పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కాగా, ఇటీవల చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. అంతకుముందు టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ గత కొంత కాలం క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఇప్పుడు ఏపీతోపాటు తెలంగాణపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పుట్టిందని చంద్రబాబు అన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీనేని చంద్రబాబు పేర్కొన్నారు.
కాసాని మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాలతో తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారన్నారు. పార్టీకి పూర్వ వైభవం రావడానికి గ్రామగ్రామాన తిరిగి కృషి చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ విజయం సాధించబోతోందన్నారు.