కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కట్టప్ప ఆరోపణలు.. మునుగోడు కాంగ్రెస్ లో విశ్వాసపరీక్ష ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఇప్పుడు పార్టీలో పెద్ద కష్టం వచ్చి పడింది. సొంత పార్టీ నేతలకు ఆయన నమ్మకం కలిగించడం కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. కోమటి రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో, కాంగ్రెస్ పార్టీలో గతంలో బలంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పట్టు తప్పినట్టయింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పెద్ద తలనొప్పిగా తయారైంది.
మునుగోడులో పీక్స్ కి ఉప ఎన్నిక వార్
మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో, ఆయన బీజేపీ బాట పట్టడంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో సత్తా చాటిన కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో కూడా దూసుకుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్న పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే మునుగోడులో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడును తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, బిజెపి మునుగోడులో కాషాయం జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. ఇక సిట్టింగ్ స్థానమైన తమ స్థానాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతుంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ లో అపనమ్మకం
అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నకారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తే మునుగోడు లో విజయం సునాయాసం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన తన తమ్ముడికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అన్న ఆరోపణలు వెల్లువ గా మారడంతో ఆయనపై అందరికీ అనుమానం మొదలైంది. ఆయన నిజంగానే కాంగ్రెస్ అభ్యర్థి కోసం పని చేస్తాడా? లేక తన సోదరుడి కోసం పని చేస్తాడా? అన్నది పార్టీ నేతలలో ఉన్న సంశయం.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆరోపణల వెల్లువ
అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కానీ ఎవరికి ఎటువంటి ఫోన్ కాల్స్ చేయలేదని, తన తమ్ముడికి తాను సహకరించడం లేదని చెబుతున్నప్పటికీ ఆయన పైన ఆరోపణలు మాత్రం వెల్లువ గా మారాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీలోనే ఉన్నప్పటికీ,బీజేపీలో ఉన్న తన సోదరుడు కె. రాజ్గోపాల్రెడ్డికి మద్దతు ఇవ్వడమే కాకుండా, సోదరుడికి మద్దతు కోసం కాంగ్రెస్ శ్రేణులపై ఒత్తిడి పెంచుతున్నారని మునుగోడు కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసిన తర్వాత ప్రచారంలో పాల్గొంటానని పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి చెప్పడంతో ఆరోపణల దుమారం రేపింది. టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్రెడ్డి ప్రచారం కోసం నియోజకవర్గంలోని ఏ మండలాన్ని ఎంపీకి కేటాయించకపోవడం విశేషం.
రాజగోపాల్ రెడ్డి భల్లాలదేవ .. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కట్టప్ప
మునుగోడు మండలం వూకొండి గ్రామంలో ఇంటింటికీ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు.. కోమటిరెడ్డి సోదరులు పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి తన సోదరుడికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఒకరు భల్లాలదేవ, మరొకరు కట్టప్ప అని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భల్లాల దేవుడిలా ముందు నుండి దాడి చేసినట్లే ఉన్నారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కటప్పలా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. పార్టీని దెబ్బతీయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు అని 'బాహుబలి' చిత్రంలోని పాత్రలను ప్రస్తావిస్తూ తెలిపారు.
విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహి కాకపోతే, ఆయన పార్టీ జెండాపై ప్రమాణం చేయాలి. కాంగ్రెస్లో భాగంగా ఉంటూనే పార్టీ అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను చిత్తశుద్ధితో పని చేస్తానని, ఒక అవకాశం ఇవ్వాలని, తనను నమ్మాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాల్వాయి స్రవంతి విజయం కోసం తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నా, స్థానిక నాయకులలో మాత్రం ఆయనపై ఎలాంటి విశ్వాసము లేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు.