మానవత్వమని లోకేష్ చెప్తారుగా!: కవిత కౌంటర్, మాఫీపై ఆర్పీఐ పైకి..
హైదరాబాద్: తెలంగాణ జాగృతి సంస్థ పైన వస్తున్న ఆరోపణల పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు కౌంటర్ ఇచ్చారు. జాగృతి పైన విపక్ష నేతలు.. ముఖ్యంగా టిడిపి నేతలు పలుమార్లు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రేపటి నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతకుమ్మ వేడుకల పైన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విమర్శల పైన మాట్లాడారు.
తాము మానవతా దృక్పథంతో తెలంగాణ జాగృతిని నడుపుతున్నామని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని మానవతా దృక్పథంతో నడుపుతోందని గుర్తు చేశారు. తాము కూడా అంతేనన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయం చేస్తున్నట్లు నారా లోకేష్ పలుమార్లు చెప్పారని కవిత అన్నారు. వారు కూడా మానవతా దృక్పథంతోనే చేస్తున్నారు కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి పనిని చేయలేదని, అందుకే మానవతా దృక్పథంతో స్పందించేందుకుజాగృతి ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం తరఫున సాయం అందని రైతులకు తెలంగాణ జాగృతి సాయం అందిస్తుందన్నారు. యూఎస్, యూకే నుంచి మద్దతు ఉంటుందన్నారు. రైతులకు నాలుగేళ్ల వరకు జాగృతి సాయం చేస్తుందన్నారు. 389 కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
రైతులకు ఏకమొత్తంలో రుణమాఫీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించడం లేదని చెప్పారు. రైతులకు జాగృతి నెలకు రూ.2,500 ఇస్తుందని చెప్పారు. విపక్షాలు ప్రతి దసరాకు ఎంటర్టైన్ చేసే పులుల్లా మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ టిడిపికి తోక పార్టీగా మారిందన్నారు.
ఆశా వర్కర్ల సమస్య రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు. ఏపీ ప్రభుత్వంలోని ఆశా వర్కర్లు ఎర్ర జెండాల పార్టీలకు కనిపించడం లేదా అని నిలదీశారు. రుణమాఫీ పైన ఏపీలో ఓ న్యాయం, తెలంగాణలో మరో న్యాయం ఉంటుందా అన్నారు.
రైతు సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక సెల్: ఈటెల
రైతు సమస్యలు పరిష్కరించేందుకుగాను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు.
దీంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల వేతనాల పెంపు కేంద్రం పరిధిలోనిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నింద వేయవద్దన్నారు. వేతనాల పెంపు విషయమై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.