'మహా' నీటికి కేంద్రం అడ్డుపుల్ల: అందుకే మోడీపై కవిత ఫైర్?
హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు ద్వారా ప్రయత్నాలు సాగించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఫలితం సాధించలేకపోయింది. నీటి విడుదలకు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడడం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో మెలగకపోవడం వల్లనే కేంద్రం నీటి విడుదలకు అడ్డుపడినట్లు భావిస్తున్నారు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మోడీతో దోస్తీ ఏదీ లేదని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పలు మార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించలేదు. దీంతో ఆదిలాబాదు జిల్లాలోని బాసరతో పాటు పుష్కరఘాట్ల వద్ద నీటి లభ్యత లేకుండా పోయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని టిఆర్ఎస్ ఎంపి కవిత తెలిపారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం, ప్రజా అనుకూల నిర్ణయాలను స్వాగతిస్తామని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు.
మాదాపూర్లోని ఫినిక్స్ గ్రూప్ కంపెనీ ఆవరణలో శుక్రవారం హరిత హారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజనపై పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, విభజన తరువాత కూడా అన్యాయం కొనసాగించే విధంగా ఉంటే సహించేది లేదని అన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు అప్పగించే కుట్ర జరుగుతోందని, కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు కుట్రను పార్లమెంటులో ఎండగడతాం అని తెలిపారు.