తెలంగాణ అసెంబ్లీకి ఎంపీ కవిత: ప్రతిపక్షల తీరుపై మండిపడిన హరీశ్
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం రాష్ట్ర అసెంబ్లీకి విచ్చేశారు. సభా కార్యక్రమాలను వీక్షించేందుకు ఆమె అసెంబ్లీకి వచ్చారు. అక్కడ ఆమెకు అధికారులు సాదర స్వాగతం పలికారు.
ఆ తర్వాత ఆమె సభలోకి వెళ్లారు. కాగా, కవిత సభకు వచ్చిన కొద్దిసేపటికే ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ 10 నిమిషాలపాటు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైంది.
ప్రతిపక్షాలపై మండిపడిన హరీశ్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు రోజుల విరామం తర్వాత శనివారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళనకు దిగారు.
మంత్రి హరీష్రావు ప్రతిపక్ష సభ్యులపై మండిపడ్డారు. ఇది సభా సాంప్రదాయం కాదని సూచించారు. సభలో చేయాల్సింది రాజకీయాలు కాదు, చర్చ అని అన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్లకు కావాల్సింది చర్చ కాదని రచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చర్చకంటే రచ్చ చేయడానికే ఉత్సాహం చూపుతున్నదని దుయ్యబట్టారు. వేరే ఫాంలో వస్తే చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక ఏ అంశంపైనా చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.
పక్క రాష్ట్రంకంటే మన రాష్ట్ర అసెంబ్లీలో సభను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తోన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి జోక్యంచేసుకుని వెల్లోకి దూసుకు రావొద్దని బీఏసీలో నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రశ్నలు చాలా ఉన్నాయని, రైతులకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉందని.. అందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
జీసస్ రన్లో పాల్గొన్న కవిత
మంచి కోసం పరితపించే జీసస్.. ఆశయాలు ఎందరికో స్పూర్తినిస్తాయని ఎంపీ కవిత అన్నారు. చెడు తర్వాత తప్పకుండా మంచి జరుగుతుందనడానికి ఈస్టర్ పర్వదినమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
జీసస్ ఫర్ రన్ పేరుతో నిర్వహించిన పరుగును ఎల్బీస్టేడియంలో కవిత ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు పరుగు సాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రైస్తవులతో పాటు ఎంపీ ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు.
ప్రపంచంలో ఉగ్రదాడులు తీవ్రమవుతున్న తరుణంలో శాంతి సందేశాలు చేకూరాలని, ప్రజల్లో మనోస్థైర్యం నింపేందుకు చేపట్టిన జీసస్ఫర్ రన్ ఎంతో శుభపరిణామమని ఎంపీ కవిత అన్నారు. కొత్త రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని అంతా ప్రార్థన చేయాలని ఆమె కోరారు.